High Tension In Anaparthi : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్టారెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దీంతో అనపర్తి మండలం రామవరం గ్రామంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి , అక్రమాలకు పాల్పడ్డారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టాను తయారు చేశారు. అందులో 109 అంశాలను పొందుపర్చారు. ఈ అంశాలపై చర్చ చర్చకు సిద్ధమా అంటూ సత్తి సూర్యనారాయణరెడ్డికి గురువారం నల్లమిల్లి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఇంటి వద్దే ఈ అంశాలన్నీ చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు.
శుక్రవారం ఉదయం రామవరం గ్రామం నుంచి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బయలు దేరారు. ఎమ్మెల్యే సత్తి సూర్యానారాయణరెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో భారీగా టీడీపీ కార్యకర్తలు నల్లమిల్లి నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రామవరం గ్రామంలోనే అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని నిలిపివేశారు. ఆయన కారు చుట్టూ భారీగా పోలీసులు చేరి నిలువరించారు.
Read More: జగన్ కు ఓటేయకండి.. వైఎస్ సునీత పిలుపు
మరోవైపు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరూ ఆయన నివాసం సమీపంలోకి రాకుండా బారికేడ్లు పెట్టారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకోవడంతో హైటెన్షన్ ఏర్పడింది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
పోలీసుల వ్యవహారశైలిపై టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తనపై వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. తనతో చర్చిస్తామని వచ్చి నిర్భంధించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపైనా నల్లమిల్లి విమర్శలు గుప్పించారు. హైస్కూల్ స్థలాలు ఆక్రమించారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ఇళ్ల పట్టాల పేరిట భూసేకరణ చేశారన్నారు. అందులో 15 కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు.