![ap inter exams today](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/03/ap-inter-exams-in.jpg)
AP Inter Exams from Today (Ap latest news) : ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలవ్వగా.. రేపు ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ నెల 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 10, 52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 1559 సెంటర్లను బోర్డు సిద్ధం చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే సెంటర్లు కేటాయించారు.
పరీక్షలపై ఇంటర్ బోర్డ్ డిజిటల్ నిఘా పెట్టింది. 22 వేల సీసీ కెమెరాలతో పరీక్షా కేంద్రాల్లో నిఘా ఉంచారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ప్రకటించారు. అలాగే నేడు జరిగే పరీక్షకు సెట్-1 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
Read More : ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్.. 14 రోజులు రిమాండ్
విద్యార్థులు 8.45 గంటల కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరు కానున్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో పాటు 60 సిట్టింగ్ స్క్వాడ్స్ ను నియమించింది బోర్డు.
కాగా.. పేపర్ లీక్ ను అరికట్టేందుకు క్యూ ఆర్ కోడ్ ను జత చేశారు. ప్రశ్నాపత్రాలకు మూడు దశల్లో క్యూ ఆర్ కోడ్ ను జత చేశారు. ప్రశ్నాపత్రాలను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులకు పరీక్ష రాసేందుకు సహాయకులను కూడా అందుబాటులో ఉంచినట్లు సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, ఫిర్యాదుల స్వీకరణకై 0865-277707, టోల్ ఫ్రీ నంబర్ 18004251531కు కాల్ చేయొచ్చని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.