AP : ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పట్లేదట. తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. ఇవే రొటీన్ డైలాగులట. గంటల తరబడి విసిగిస్తున్నాడట. ఏది అడిగినా.. ఏమో అంటున్నాడట. అన్నం తినమంటే తినట్లేదట. నాకు అవసరం లేదంటూ మొండి చేస్తున్నాడట. ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు మూడు రోజుల పాటు కస్టడీలో సీఐడీ అధికారులకు చుక్కలు చూపించారని తెలుస్తోంది. సోమవారం 6 గంటల పాటు.. 80కి పైగా ప్రశ్నలు అడిగితే.. దేనికీ సరైన సమాధానం చెప్పలేదని అంటున్నారు. మంగళవారం కూడా అదే ధోరణి కంటిన్యూ చేశారని సమాచారం.
3 రోజులు మమ..!
ముంబై నటి జెత్వానీ కేసులో అరెస్ట్ అయిన PSR ఆంజనేయులును మూడు రోజుల పాటు ప్రశ్నించింది CID. అయితే విచారనకు ఆయన ఏమాత్రం సహకరించలేదని అంటున్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు అధికారులు చెబుతున్నారు. కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పరిధిలో లేదని అధికారులకే ఎదురు ప్రశ్నలు వేశారట. పేరుకు మూడు రోజుల విచారణ జరిగినా.. పీఎస్ఆర్ నుంచి పెద్దగా ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. మరోసారి కస్టడీకి కోరాలని సీఐడీ ఆలోచన చేస్తోంది.
PSR vs CID
అసలే సీనియర్ ఐపీఎస్. చట్టంలోని లూప్హోల్స్ అన్నీ తెలిసిన పర్సన్. అందుకే విచారణకు సహకరించకుండా ఇబ్బందిపెడుతున్నారని.. ఆయన్నుంచి నిజాలు రాబట్టడం కష్టంగా మారిందని అంటున్నారు. తనకేమీ కాదనే ధీమాలో పీఎస్ఆర్ ఉన్నారట. అయితే, ఆధారాలు పక్కాగా ఉండటంతో.. ఈ కేసు నుంచి ఆయన బయటపడటం కూడా అంత ఈజీ కాదని సీఐడీ అధికారులు కాన్ఫిడెంట్గా చెబుతున్నారు.
గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు?
మరోవైపు.. ఆంజనేయులుపై మరో కేసు నమోదయింది. వైసీపీ హయాంలో ఐపీఎస్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నారు. ఆ సమయంలో గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రహస్యంగా ఉంచిన ఈ కేసు విచారణ బాధ్యతలను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు తెలిసింది. దీనిపై ప్రత్యేక బృందాలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశం ఉంది. పీఎస్ఆర్కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు లభించాయని.. పకడ్బందీగా కేసు ఫైల్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. అదే జరిగితే.. ఆంజనేయులు ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనని అంటున్నారు.