విశాఖలో ఇప్పటికే ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి 150 బడా కంపెనీలు రాబోతున్నాయి. దీంతో చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీఐసీసీ నిర్వహణలో భూములు కేటాయించింది.
మరో ఆరు నెలల్లో 15 కంపెనీలు విశాఖలో ఏర్పడే అవకాశం ఉంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్కు మధురవాడ సమీపంలో 80 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. గూగుల్ డేటా సెంటర్తో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దీంతోపాటు ఏఐ,క్లౌడ్ సర్టిఫికేషన్ మెంటార్ షిప్, కొత్త కంపెనీలు ఏర్పాటు చేసే యువతకు శిక్షణ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది.
విశాఖకు ఐటీ కంపెనీలు రావడంపై యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి నగరాలకు వెళ్లకుండా.. సొంత ప్లేస్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు కూడా విశాఖలోని ప్రదేశాలు ఆహ్లాదాన్నిస్తాయని తెలిపారు.
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు కలెక్టర్ హరేందిరా ప్రసాద్. రానున్న మూడేళ్లలో విశాఖ ఐటీ హబ్గా మారుతుందన్నారు. ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఏపీలో క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తే.. విశాఖ దశ మారుతుంది అంటున్నారు సింబయాసిస్ ఐటీ కంపెనీ సీఈఓ నరేష్. ప్రభుత్వం ఐటీ పాలసీ తీసుకొచ్చి ముందు చూపుతో వ్యవహరించిందన్నారు.
Also Read: జగన్కి మళ్లీ షాక్.. 113 మందికి నోటీసులు
విశాఖ.. హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో పాటు మౌలిక వసతుల రూపకల్పన కూడా చేస్తుంది. ఇదేవిధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే రానున్న ఐదేళ్లలో ఎన్నో ఐటీ పరిశ్రమలు విశాఖలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.