Jagan: చేసిన పాపాలు ఊరికే పోవని అంటుంటారు. జగన్, ఆ పార్టీ కార్యకర్తల విషయంలో అదే జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలను ఉక్కుపాదంతో అణిచివేశారు. నేతలు, కార్యకర్తలను జైలుకి పంపించిన సందర్భాలు కోకొల్లలు. ప్రస్తుతం ఏపీలో సీన్ రివర్స్ అయ్యింది. కూటమి పాలన ఏడాది సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు.
వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండించారు మాజీ సీఎం జగన్. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ని సూటిగా ప్రశ్నిస్తూ పలు అంశాలు లేవనెత్తారు. మేం అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటూ చిన్నపాటి హెచ్చరిక చేశారు.
వైసీపీ అసలు రూపం బయటపడింది. తాము అధికారంలోకి మా పాలన ఎలా ఉంటుందో ముందుగా చెబుతున్నారు జగన్. అరెస్టులు కొనసాగుతాయని చెప్పకనే చెబుతున్నారు. గత వైసీపీ పాలన గురించి చెప్పనక్కర్లేదు. విపక్ష నేతలు ఏదైనా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే ఇళ్ల నుంచి బయటకు రానిచ్చేవారు కాదు పోలీసులు. యాక్ట్ 30 అమల్లో ఉందని హౌస్ అరెస్టు చేసేవారు.
కూటమి సర్కార్ అలా చేయలేదు. వైసీపీ నేతలు సభలు, సమావేశాలు పెట్టుకుంటున్నారు. కాకపోతే కేడర్ని కాపాడుకునేందుకు మాటలు హద్దులు దాటుతున్నాయి. అధికారంలో ఉన్నట్లుగా వైసీపీ కేడర్ రెచ్చిపోవడంతో పోలీసులు తమ పని చేసుకుపోతున్నారు. అయినా సరే వైసీపీకి చెందిన కొందరు నేతలు హద్దులు దాటుతున్నారు. జగన్ తర్వాత ఆ స్థాయిలో మాట్లాడారు మాజీమంత్రి పేర్ని నాని. ఈ విషయంలో రేపో మాపో ఆయనకు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు పోలీసులు.
ALSO READ: ఏపీలో EAPCET-2025 వెబ్ ఆప్షన్ల ఎంపిక, 22 నుంచి
శనివారం కృష్ణాజిల్లా ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య చిన్నపాటి తోపులాట, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఛైర్పర్సన్ వాహనం డ్యామేజ్ అయ్యింది. ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు జగన్. పోలీసులు సమక్షంలో దుర్భాషలు ఆడుతూ దాడి చేయించారని రాసుకొచ్చారు.
దీన్ని పరిపాలన అనరని, చంద్రబాబు శాడిజమని ప్రస్తావించారు. రాజకీయపార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా? అంటూ ప్రశ్నించారు. మా వాళ్లని ఎందుకు హౌస్ అరెస్టు చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఆనాడు వైసీపీ పాలనలో చేసిందంటూ మాజీ సీఎం మరిచిపోయారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి, పిన్నెల్లి, ఎంపీ మిథున్రెడ్డి, నందిగం సురేష్, పోసాని కృష్ణమురళితోపాటు ఎంతోమందిపై తప్పుడు కేసులు దొంగ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇదే సంప్రదాయం రేపటి రోజు మా ప్రభుత్వం ఉంటే ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? రాసుకొచ్చారు.
రాజ్యాంగ బద్ధపాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే పరిస్థితులు ఇలాగే ఉండిపోవన్నారు. మీరంతా ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకు, దారుణాలకు, అన్యాయాలకు బాధ్యతవహించాల్సి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరించారు. ఇకనైనా శాడిజం వదిలి ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టిపెట్టాలని లేకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని రాసుకొచ్చారు.
మహిళల మీద ఈరోజు మీదాడి, మీ శాడిజంకు పరాకాష్ట @ncbn గారూ. వైయస్సార్సీపీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు, చివరకు బీసీ మహిళా నాయకుల మీద కూడా నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఉన్నారు కదా అని, చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసులు ఎలా చెప్తే అలా… pic.twitter.com/EbJHOprN6J
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 12, 2025