Pawan – Nagababu: జనసేనలో అంతర్గత పోరు భగ్గుమందా? నాగబాబుపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర అంసతృప్తితో ఉన్నారా? పార్టీ అంతర్గత సమావేశంలో బహిరంగంగానే తన కోపాన్ని వెళ్లగక్కరా? అంటే నిజమనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేనలో తన తర్వాత ఆ స్థాయిలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తారని భావించిన పవన్ కు నాగబాబు విషయంలో నిరాశే ఎదురైందని చర్చ జరుగుతోంది. దీనికి తోడు అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చి పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారన్న అసంతృప్తి పవన్ లో పెరిగిపోతున్నట్లు జనసేన వర్గాలే చర్చించుకుంటున్నాయి.
పార్టీలలో జంపింగ్ జిలానీలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో అత్యంత నమ్మకమైన వ్యక్తులు ఏ పార్టీకైనా ముఖ్యమే. అందులోనూ రక్త సంబంధీకులు పార్టీలో ఉంటే మరీ మంచిది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలు, ప్రజల సంక్షేమం, మంత్రిత్వశాఖలను ఏకకాలంలో చూసుకోవడం కష్టం కాబట్టి.. సోదరుడు నాగబాబు పార్టీ అంతర్గత వ్యవహారాలు, విపక్షాల నుంచి వచ్చే విమర్శలు ఎదుర్కొంటే బాగుంటుందని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోదరుడికి బలమైన రాజకీయ పునాది కల్పించేందుకు ఎమ్మెల్సీ పదవిని సైతం ఇప్పించారని టాక్. అయితే ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నాగబాబు.. పవన్ అంచనాలను అందుకోలేకపోయారని రాజకీయ నిపుణులు ఆరోపిస్తున్నారు. క్రియాశీలక రాజకీయ నాయకుడిగా ఆయన ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జరిగిన ఆడవారి బట్టల వివాదంలోకి నాగబాబు కలుగ చేసుకొని ప్రత్యేకంగా ఒక వీడియో సందేశం ఇవ్వడం జన సైనికులకు సైతం రుచించలేదని తెలుస్తోంది. శివాజీ వ్యాఖ్యలకు కొందరు మద్దతు ఇస్తే.. అనసూయ, చిన్మయి వంటి సెలబ్రిటీలకు మరికొందరు సపోర్ట్ గా నిలిచారు. సమాజం రెండుగా చీలిపోయిన ఈ వివాదంలోకి తలదూర్చడం ఎందుకులే అని.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు మౌనం వహించాయి. కానీ, నాగబాబు మాత్రం ఈ విషయంలో కలుగుచేసుకోవడం జనసేన నేతలకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించినట్లు సమాచారం. తాను వ్యక్తిగతంగా ఈ అంశంపై స్పందిస్తున్నట్లు నాగబాబు చెప్పినప్పటికీ.. జనసేన ఎమ్మెల్సీగా గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నందున.. ఆయన వ్యాఖ్యలు పార్టీ స్టాండ్ లాగానే అందరూ భావించారు. ఇది కూడా జనసేనాని పవన్ ను అసంతృప్తికి గురిచేసినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Also Read: Pakistan PM-ICC: పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చెత్త వాగుడు..PCBకి ఇక చిప్పకూడే..ఐసీసీ స్కెచ్ అదుర్స్
ఈ క్రమంలో సోమవారం జరిగిన జనసేన సాధారణ సభలో పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం వెనుక నాగబాబు అంశం కూడా ఓ కారణంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహిళల దుస్తుల వివాదంపై సోషల్ మీడియాలో స్పందించడానికి దొరికిన సమయం.. తిరుమల కల్తీ నెయ్యిపై ఇంత జరుగుతున్నా, వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తున్నా స్పందించడానికి సమయం దొరకలేదా? అంటూ పవన్ పరోక్షంగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే నాగబాబు తాజాగా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై వెంటనే వీడియో విడుదల చేసి.. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పార్టీలో నాగబాబు క్రియాశీలక భాగస్వామ్యాన్ని పవన్ బలంగా కోరుకుంటున్నట్లు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: Tirumala Ghee Case Updates: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్లలో డైయిరీ నిపుణుడు, సైంటిస్ట్