YSRCP : మూడు సార్లు పిలిచారు. మూడు సార్లు డుమ్మా కొట్టారు. హైకోర్టు చెప్పినా వినలేదు. ఏపీ లిక్కర్ అక్రమాల కేసులో కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి పదే పదే పారిపోతున్నారు. సీఐడీ నోటీసులను కేర్ చేయకుండా.. సిట్ విచారణకు అటెండ్ కాకుండా.. ముచ్చటగా మూడోసారి కూడా డుమ్మా కొట్టారు. కసిరెడ్డి తీరుపై సీఐడీ సీరియస్గా ఉందా? ముందుముందు క్రొకడైల్ ఫెస్టివల్ తప్పదా?
లిక్కర్ మాస్టర్ మైండ్ కసిరెడ్డినే?
అంతా కసిరెడ్డి రాజశేఖర్రెడ్డినే చేశారని ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సూటిగా చెప్పేశారు. ఏపీ లిక్కర్ స్కాంలో కసిరెడ్డినే కీలక సూత్రధారి అని సీఐడీ కూడా భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పని చేసిన రాజశేఖర్రెడ్డి.. జగన్కు చాలా క్లోజ్ అంటారు. ప్రభుత్వ మద్యం పాలసీ అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఏపీలో ఏ బ్రాండ్లు అమ్మాలి? ఎంత రేట్కు అమ్మాలి? ఎవరి నుంచి కొనాలి? అసలు రేట్ ఎంత? తెరవెనుక డీల్ ఎంత? ఇలా గోల్మాల్ యవ్వారమంతా కసిరెడ్డినే నడిపించారని సీఐడీ ఆరోపణ. అందులో నిజానిజాలు విచారించడానికి రమ్మంటే ఆయన మాత్రం రాను రానంటూ మూడుసార్లు తప్పించుకున్నారు. హైకోర్టుకు వెళ్లి రిలీఫ్ కోరుకున్నా.. ముందస్తు నోటీసులు ఇచ్చి.. టైమ్ ఇచ్చి.. ఎంక్వైరీ చేసుకోవచ్చని చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 25న సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 9న విచారణకు రావాలని పిలిచింది. కానీ, కసిరెడ్డి మాత్రం ఈసారి కూడా డుమ్మా కొట్టారు.
కసిరెడ్డి వస్తే.. వాళ్లకు చిక్కులేనా?
ఎందుకు? రాజశేఖర్రెడ్డి అంతగా ఎందుకు భయపడుతున్నారు? సీఐడీ విచారణకు ఎందుకు రావట్లేదు? అడ్డంగా దొరికిపోతాననా? పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి.. తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. అనే రొటీన్ డైలాగ్స్ చెప్పడం కుదరదని బెదిరిపోతున్నారా? సీఐడీ ముందుకు వస్తే.. అసలు పెద్దల పేర్లు చెప్పాల్సి వస్తుందనా? వివేకానంద హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోతుండటం చూసి.. తనకు కూడా ఏదైనా జరగరానిది జరిగిపోతుందని హడలి పోతున్నారా? ఇలా అనేక ప్రశ్నలు.
Also Read : ఆ మంత్రితో రోజా రహస్యంగా.. ఏంటి సంగతి?
మిథున్రెడ్డికి చెక్ పెట్టేందుకేనా?
ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్రెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిథున్రెడ్డిని విచారించముందే కసిరెడ్డిని ప్రశ్నిస్తే.. ఆయన ఇచ్చిన సమాచారంతో కింగ్ పిన్కు చెక్ పెట్టొచ్చనేది సీఐడీ ఆలోచనలా కనిపిస్తోంది. అందుకే, కసిరెడ్డికి మూడుసార్లు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి రప్పించే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం డుమ్మా కొడుతూ వస్తున్నారు. విచారణకు వెళ్లకుండా కసిరెడ్డిని ఎవరైనా అడ్డుకుంటున్నారా? బెదిరిస్తున్నారా? కీలక సూత్రధారిని ఎక్కడైనా దాచేశారు? ఆయన నోరు విప్పితే తమకు చిక్కులు తప్పవని.. ఆనాటి వైసీపీ పెద్దలే ఇప్పుడు తెరవెనుక నుంచి కట్టడి చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది.