Kesineni Brothers: బెజవాడ రాజకీయం చాలా రోజుల తర్వాత మళ్లీ హీటెక్కింది. కొంతకాలంగా సాగుతున్న కేశినేని బ్రదర్స్ పొలిటికల్ వార్.. హై-వోల్టేజ్ డ్రామాగా మారింది. ఒకప్పుడు ఒకే రూట్లో నడిచిన అన్నదమ్ములు… ఇప్పుడు ఒకరిని ఒకరు రాజకీయంగా ముగించేయడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడేస్తున్నారు. లేటెస్ట్గా.. అన్న కేశినేని నాని.. తమ్ముడు కేశినేని చిన్నిపై నేరుగా ఈడీకి ఫిర్యాదు చేయడం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎంపీ కేశినేని చిన్నితో పాటు ఆయన భార్య జానకి, కుమారుడు వెంకట్పైనా.. పీఎంఎల్ఏ కింద విచారణకు డిమాండ్ చేశారు. వీళ్ల ప్రధాన అనుచరుడు రాజ్ కేసిరెడ్డి నెట్వర్క్ని టార్గెట్ చేస్తూ.. నాని ఈ ఫిర్యాదు చేశారు. ఇటీవలే.. కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులిచ్చింది. ఇంతలోనే.. నాని ఈడీకి రాసిన లేఖ బెజవాడ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈడీకి కేశినేని నాని లేఖ..
ఈడీకి రాసిన లేఖలో.. కేశినేని నాని అనేక అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ కావడం, చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేయడంతో.. దర్యాప్తుని ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు.. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ టికెట్ విషయంలో జరిగిన 5 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం, బొల్లినేని మోహన్ రావు, సుంకర రామచంద్రరావు అకౌంట్లలోకి వెళ్లిన కోట్ల రూపాయల సొమ్ముపైనా దర్యాప్తు చేయాలని కోరారు.
కేశినేని డెవలపర్స్పై నాని ఆరోపణలు
మరోవైపు, కేశినేని డెవలపర్స్ పేరుతో దుండిగల్, పటాన్చెరువు, గచ్చిబౌలి, బంజారాహిల్స్, శంకర్పల్లి ప్రాజెక్టుల్లో.. ప్రీ-లాంచ్ పేరిట కస్టమర్లను మోసం చేశారని.. దీనికి సాహితీ ఇన్ఫ్రా స్కామ్తో లింకులున్నాయని నాని ఆరోపించారు. అలాగే ఈడీ అటాచ్మెంట్, NCLT, PMC బ్యాంక్ కేసుల్లో ఉన్న 112 ఎకరాల ప్రగతి నగర్ భూమిని సుప్రీం కోర్టును తప్పుదారి పట్టించి.. కాంప్రమైజ్ పిటిషన్ ద్వారా దాచేసి ప్రీ-లాంచ్ సేల్స్ చేశారన్నారు. వీటితో పాటు అనేక అక్రమ దందాల్లో ఎంపీ కేశినేని చిన్ని నెట్వర్క్ పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయని రాశారు.
కేశినేని చిన్ని పై ఆరోపణలు
వీటితో పాటు కేశినేని చిన్ని అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో అవినీతి, విజయవాడ ఉత్సవం పేరుతో 500 కోట్ల వరకు బలవంతపు వసూళ్లు జరిగాయని ఆరోపించారు. చివరకు.. అమెరికాలో విద్యార్థులని, వలసదారులను సైతం మోసం చేస్తున్నారని.. సమగ్ర విచారణ జరిపి.. ఆస్తులను అటాచ్ చేయాలని ఈడీని కోరారు.
కేశినేని బ్రదర్స్ వార్కు ఎండ్ కార్డు లేదా?
విజయవాడ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ పొలిటికల్ ఎపిసోడ్ చాలా డిఫరెంట్. తనని కాదని తెలుగుదేశం పార్టీలో తమ్ముడికి ప్రాధాన్యత ఇస్తన్నారనే కేశినేని నాని రగిలిపోయారు. ఈ విషయంలో.. అధిష్టానంతో విభేదాలు వచ్చాయి. దాంతో.. నాని వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి అన్న వైసీపీ తరఫున, తమ్ముడు చిన్ని టీడీపీ తరఫున పోటీకి దిగారు. కూటమి ప్రభంజనంలో.. తమ్ముడు కేశినేని చిన్ని ఎంపీగా గెలిచారు. రాజకీయంగా శత్రువులైన అన్నదమ్ములు.. ఎన్నికలు ముగిసినా తమ పగను మాత్రం చల్లార్చుకోవడం లేదు. అప్పటి నుంచి ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూనే ఉన్నారు.
కేశినేని బ్రదర్స్ వార్కు కొత్త ట్విస్ట్
బ్రదర్స్లో.. ఎవరూ తగ్గట్లేదు. తమ్ముడి పొలిటికల్ కెరీర్ని ఎలాగైనా దెబ్బతీయాలని.. నాని భావిస్తున్నారు. ఈడీకి ఫిర్యాదు చేయడం ద్వారా చిన్నిని డిఫెన్స్లో పడేయొచ్చన్నది నాని వ్యూహం కావొచ్చు. ఏదేమైనా.. అన్నదమ్ముల మధ్య పొలిటికల్ పోరు బెజవాడ పాలిటిక్స్ని హీటెక్కిస్తోంది. ఇప్పుడు గనక నాని ఇచ్చిన ఫిర్యాదుపై.. ఈడీ చర్యలు తీసుకుంటే.. అది ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతుంది. కేశినేని నాని ఇచ్చిన ఈడీ కంప్లైంట్ ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఓ టైమ్ బాంబులా మారింది. అది పేలుతుందా? లేదా? అనేదే ఇప్పుడు బిగ్ సస్పెన్స్. కేశినేని చిన్నికి ఈడీ నోటీసులిస్తుందా? లేదా? అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోతుంది.
Also Read: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆటో డ్రైవర్కు 20 ఏళ్ల జైలు శిక్ష