Chalasani Anjaneyulu: కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ) చైర్మన్ పదవిని చుట్టుముట్టిన ఉత్కంఠకు, రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ పదవితో పాటు బోర్డు డైరెక్టర్ పదవికి కూడా చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. మంత్రుల సుదీర్ఘ మంత్రాంగాలు, సంప్రదింపుల తర్వాత ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
రాజీనామా వెనుక మంత్రుల మంత్రాంగం
పార్టీ నిర్ణయించిన నాయకత్వ మార్పును గౌరవించాలని కోరుతూ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, కొలుసు పార్థసారథిలు కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే, ఆ సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చలసాని ఆంజనేయులు మొదట రాజీనామాకు నిరాకరించారు. అవసరమైతే తనపై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించుకోవచ్చని తేల్చిచెప్పడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.
కొలుసు సంప్రదింపులు.. ఫలించిన నచ్చజెప్పుడు
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి చలసానితో మాట్లాడారు. పార్టీ ప్రయోజనాలు, భవిష్యత్తును వివరించి ఆయనకు నచ్చజెప్పడంతో చలసాని మెత్తబడ్డారు. పార్టీయే తనకు ముఖ్యమని, అధిష్ఠానం ఆదేశాలు పాటిస్తానని రాజీనామా లేఖపై సంతకం చేశారు. మరొకరికి అవకాశం కల్పించాలనే సదుద్దేశంతోనే ఆయన వైదొలిగారని మంత్రి పార్థసారథి తెలిపారు.
చలసాని పెట్టిన షరతులు.. మంత్రి హామీ
రాజీనామా చేసే ముందు చలసాని మంత్రి పార్థసారథి ముందు రెండు కీలక హామీలు ఉంచారు. విజయవాడ చిట్టినగర్లోని 24.70 ఎకరాల మిల్క్ ఫ్యాక్టరీ స్థలానికి కృష్ణా మిల్క్ యూనియన్ పేరుతో టైటిల్ డీడ్ ఇప్పించాలని కోరారు. అయితే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, ఖాళీ అయిన డైరెక్టర్ పోస్టులో గతంలో నామినేషన్ సమయంలో వైదొలిగిన చలసాని చక్రపాణికి అవకాశం ఇవ్వాలని కోరారు. దానికి కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు.
Also Read: హైడ్రా ఉద్యోగాల ఈవెంట్స్.. సరూర్నగర్ స్టేడియం వద్ద గందరగోళం!