Lokesh with PK: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా టర్న్ అవుతాయో ఎవరికీ తెలీదు. లేటెస్ట్గా జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్- మంత్రి నారా లోకేష్ మధ్య సమావేశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఇరువురు ఎందుకు భేటీ అయ్యారు? తెలంగాణ వైపు టీడీపీ ఫోకస్ చేసిందా? అదే జరిగితే బీఆర్ఎస్ పనైపోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మంగళవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్- రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. ఇరువురు మధ్య దాదాపు గంటకు పైగానే సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగున్నరేళ్ల వరకు ఎన్నికలు లేవు. వీరి సమావేశానికి దారి తీసిన కారణలేంటి? తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేసిందా? అవుననే సంకేతాలు టీడీపీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి నివాసం జన్పథ్ -1కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చారు. అక్కడ మంత్రి నారా లోకేష్తో దాదాపు గంటకుపైగానే చర్చలు జరిపారు. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తొలుత ఏపీలో రాజకీయాల గురించి ఇరువురు నేతలు చర్చించారు.
కూటమి సర్కార్ ఏర్పడిన ఆరునెలల్లో ప్రభుత్వం పని తీరు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారట మంత్రి లోకేష్. ఉగాదికి కొన్ని పథకాలు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. అలాగే వైసీపీ గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం.
ALSO READ: వైసీపీలో నిర్వేదం.. రోజా ఆసక్తికర కామెంట్స్
ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్టు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే పలు సూచనలు చేశారన్నది దాని సారాంశం. అదే జరిగితే బీఆర్ఎస్కు మరిన్ని కష్టాలు తప్పవన్నమాట. ఇప్పటికే చాలామంది నేతలు వలసపోయారు. రేపో మాపో వెళ్లేందుకు మరికొందరు సిద్దమవుతున్నారు.
తెలంగాణలో టీడీపీ ఏ విధంగా ముందుకెళ్లాలి? బీఆర్ఎస్లో సగానికిపైగా ఉన్న నేతలు టీడీపీకి చెందినవారే ఉన్నారు. గతంలో బీఆర్ఎస్కు వ్యూహకర్తగా వ్యవహరించాలని పీకె భావించారు. హైదరాబాద్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయించారు. సర్వే రిపోర్టు ప్రకారం కీలక సూచనలు సైతం చేశారు. అందుకు సంబంధించి డేటా సైతం పీకె దగ్గర ఉంది.
కేసీఆర్తోపాటు మరికొందరు నేతలు ప్రశాంత్ కిషోర్ ఆలోచనను ససేమిరా అంగీకరించలేదు. దీంతో ఆయన హైదరాబాద్కు రావడం మానేశారు. కొద్దిరోజులు వెనక్కి వెళ్తే.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి.
తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ-టీడీపీ-జనసేన పోటీ చేసే అవకాశముందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదు కానీ, తెర వెనుక టీడీపీతోపాటు బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక డిలే అవుతుందని అంటున్నారు. మూడు పార్టీలకు ఆమోదమైన నాయకుడ్ని నియమించాలన్నది బీజేపీ ఆలోచనగా కొందరు చెబుతున్నారు.