Thailand Cyber Scam: ఉద్యోగాల పేరుతో థాయ్లాండ్ వెళ్లి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ తెలుగు యువకుల దయనీయ పరిస్థితిపై ఏపీ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. బాధితుల ఆవేదనను, వారి కుటుంబాల ఆందోళనను తాను పరిపూర్ణంగా అర్థం చేసుకోగలనని, వారిని సురక్షితంగా మాతృదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..?
బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఒక ఏజెంట్ మోసానికి ఈ యువకులు బలయ్యారు. అక్కడకు వెళ్లాక, సైబర్ కేటుగాళ్లు వీరిని తమ కస్టడీలోకి తీసుకుని బలవంతంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడేలా తీవ్ర వేధింపులకు గురిచేశారు. వారి నరకయాతన భరించలేక, చివరకు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించి మయన్మార్ సరిహద్దు నుండి థాయ్లాండ్ సరిహద్దుకు చేరుకున్నారు. ప్రస్తుతం చిక్కుకుపోయిన ఈ ఆరుగురిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కాగా, ముగ్గురు హైదరాబాద్ వాసులు, మరొకరు పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తులు ఉన్నారు.
రప్పించేందుకు వేగంగా అడుగులు
ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలుసుకున్న లోకేష్.. వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు ప్రారంభించారు. కేంద్ర విదేశాంగ శాఖ, సంబంధిత రాయబార కార్యాలయ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తున్నట్లు తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని, తన మంత్రిత్వ కార్యాలయం ఆధ్వర్యంలో అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ ఆరుగురు యువకులు క్షేమంగా ఇంటికి చేరేలా చూస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
Also Read: చార్మినార్ వద్ద మహిళకు వింత అనుభవం.. నంబర్ ప్లేట్ లేని బైక్.. నకిలీ ర్యాపిడో డ్రైవర్ గుట్టు రట్టు!