ఏపీలో పెన్షన్లకోసం ఎదురు చూస్తున్న అర్హులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే నెల నుంచి అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నట్టు తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కొత్తగా పెన్షన్లు అందుకోబోతున్నవారి సంఖ్య దాదాపు 93వేల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు తొలగించిన పెన్షన్ల గురించి మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు.
2024 ఎన్నికల్లో సామాజిక పెన్షన్లపై చంద్రబాబు భారీ హామీ ఇచ్చారు. అప్పటి వరకు 3వేలు రూపాయలుగా ఉన్న పెన్షన్లను ఒక్కసారిగా 4 వేలకు పెంచుతామన్నారు. వికలాంగుల పెన్షన్లలో చూపిన వివక్షత కూడా రూపుమాపుతామన్నారు. అంతే కాదు, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గత మూడు నెలల బకాయిలు కూడా ఇచ్చేస్తామని చెప్పారు. అన్నట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలతో కలిసి లబ్ధిదారులు ఒక్కొక్కరూ తొలి నెలలో రూ.7వేలు అందుకున్నారు. ఆ తర్వాత నెలనెలా రూ.4వేలు తీసుకుంటున్నారు. అయితే కొత్త పెన్షన్ల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం లబ్ధిదారులు ఊహించినంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు.
అనర్హులపై వేటు..
వైసీపీ హయాంలో చాలామంది అనర్హులు పెన్షన్లు తీసుకున్నట్టు కూటమి ప్రభుత్వం నిర్థారించింది. వారందర్నీ తొలగిస్తూ వచ్చింది. కొంతమంది వైసీపీ నేతలే వికలాంగుల కోటాలో పెన్షన్లు తీసుకున్నట్టు గుర్తించి వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇలా తొలగించిన పెన్షన్లు కూడా చాలానే ఉన్నాయి. అయితే వాటిపై అధికారిక సమాచారం బయటకు రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే.. వితంతువుగా మిగిలిన భార్యకు వెంటనే పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికుల విషయంలో మాత్రం కొత్త పెన్షన్లు ఇంకా మంజూరు కాలేదు. వృద్ధాప్య పెన్షన్లకోసం ఎదురు చూస్తున్న వారు కూడా 10 నెలలుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం హామీలయితే ఇచ్చింది కానీ, వాటిని అమలు చేయడంలో మాత్రం తాత్సారం చేస్తోందనే అపవాదు ఉంది. పెన్షన్ పెంపు, రాయితీపై గ్యాస్ సిలిండర్ల పంపిణీ మినహా మిగతా హామీల అమలుని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోతోంది. తల్లికి వందనం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా, అన్నదాతా సుఖీభవ లాంటి పథకాలు ఇంకా పట్టాలెక్కలేదు. ఈ దశలో పెన్షన్లు కూడా చాన్నాళ్లుగా వాయిదా పడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కొత్త పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు.
5 లక్షలమందికి..
కొత్తగా ఏపీలో 5 లక్షలమంది పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని, వారందరికీ త్వరలోనే పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు మంత్రి. అయితే మేలో తొలి విడతగా 93వేలమందికి కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. గతంలో వైసీపీ హయాంలో కొత్త పెన్షన్ల పంపిణీ పండగలా సాగేది. గ్రామ సర్పంచ్ కానీ, అధికార పార్టీ నాయకుడు కానీ తొలి పెన్షన్ ని తీసుకెళ్లి లబ్ధిదారులకు అందించేవారు. ఆ తర్వాత నెలనెలా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక, వాలంటీర్లను పక్కనపెట్టింది. సచివాలయ సిబ్బందితో ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతోంది.