Vizag Mayor: జీవీఎంసీని కూటమి గెలుచుకుంది. విశాఖ మేయర్ హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కౌన్సిల్లో మొత్తం 97 మంది సభ్యులు ఉండగా.. అవిశ్వాస తీర్మానం సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు అటెండ్ అయ్యారు. కోరం ఉండటంతో జిల్లా కలెక్టర్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభించారు. తీర్మానానికి అనుకూలంగా 74 మంది ఓటువేశారు. మేయర్ పదవి నుంచి హరి వెంకట కుమారి దిగిపోవాల్సి వచ్చింది. కౌన్సిల్ మీటింగ్ను వైసీపీ కార్పొరేటర్లు బహిష్కరించి ఓటింగ్కు హాజరుకాలేదు. త్వరలోనే కొత్త మేయర్ను ఎంపిక చేస్తామని కూటమి నేతలు తెలిపారు.
మేయర్ పీఠంపై హైటెన్షన్
వారాల తరబడి ఉత్కంఠను రేపింది విశాక మేయర్ పీఠం. వైసీపీ, కూటమి నేతలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. క్యాంపులతో కాక రేపాయి. తమ సభ్యులను విదేశాలకు తరలించాయి. సంఖ్యాబలం బొటాబొటిగా ఉండటంతో ఎప్పుడు ఎవరు గోడ దూకుతారో అనే టెన్షన్ అన్నిపార్టీల్లో ఉండింది. తీరా అవిశ్వాస తీర్మానం సమాయానికి కూటమి పైచేయి సాధించింది. 74 మంది సభ్యుల ఓటింగ్తో.. మేయర్ సీటు నుంచి వైసీపీని పీకిపడేసింది.
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. అయితే ముందున్న 74 మెజార్టీలో ఆఖరి నిమిషంలో ఒకరు జారుకోవడంతో కూటమి నేతల్లో ఆందోళన చోటు చేసుకుంది. కానీ ఆఖరి నిమిషంలో మాజీ మంత్రి కూతురు ప్రియాంక చేరికతో విజయం సొంతమైంది. 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓటింగ్తో కూటమి విజయం సాధించింది. ఇక కూటమి నుంచి మేయర్ అభ్యర్థి రేసులో పిలా శ్రీనివాస్ ఉన్నారు.
వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకున్నాయి. జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాల్లో మునిగితేలారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి వేడుకలు చేసుకున్నారు. న్యాయం, ధర్మం గెలిచిందన్నారు సీఎం రమేశ్. వైసీపీ అరాచక పాలనకు కార్పొరేటర్లు చరమగీతం పాడారని గంటా శ్రీనివాసరావు చెప్పారు.
వైసీపీ అరాచక పాలనకు జీవీఎంసీ సభ్యులు చరమగీతం పాడారన్నారు కూటమి నేతలు. పేర్కొన్నారు. త్వరలోనే మంచి మేయర్ను ఎంపిక చేస్తామని గంటా తెలిపారు. అవిశ్వాసానికి అనుకూలంగా 74 మంది ఓటు వేయడం శుభ పరిణామమని అన్నారు.
విదేశాల్లో క్యాంపులు.. అయినా..
ఇన్నాళ్లు మలేషియాలో ఉన్న కూటమి కార్పొరేటర్లు తీర్మానానికి ముందే విశాఖకు చేరుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లు మాత్రం కేరళ, శ్రీలంకలోనే ఉండిపోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు 74 మంది సభ్యుల మద్దతు అవసరం. వైసీపీకి 30 మంది కార్పొరేటర్ల మద్దతు మాత్రమే ఉంది. వైసీపీ నుంచి మరో ఇద్దరిని తీసుకొచ్చేందుకు కూటమి ప్రయత్నించింది.
Also Read: జగన్కు కొత్త తలనొప్పి! ఓడినా మారని నేతల తీరు
అర్థరాత్రి హైడ్రామా
విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందు పొలిటికల్ హీట్ పెరిగింది. తమ కార్పొరేటర్లను టీడీపీ నేతలు బెదిరించారంటూ.. వైసీపీ ఓ వీడియో రిలీజ్ చేసింది. కేరళలో తమ కార్పొరేటర్లు ఉన్న రిసార్ట్కు అర్ధరాత్రి టీడీపీ నేతలు వచ్చారంటూ.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ విడుదల చేసిన వీడియోలో ఏపీ మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, VRDA చైర్మన్ కనిపించారు. ఎంత ప్రయత్నం చేసినా విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకోలేక పోయింది వైసీపీ. ఓటమితో మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కన్నీరు పెట్టినట్టు తెలుస్తోంది.