AP News : ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. బెజవాడ అబ్బాయికి పాకిస్తాన్ అమ్మాయితో పెళ్లి జరిగింది. వాళ్లేమీ ముస్లింలు కాదు. హిందువులే. దేశంలో అమ్మాయే దొరకనట్టు.. పాకిస్తాన్ యువతి మోనికా రజనీని వివాహం చేసుకున్నాడు విజయవాడకు చెందిన పవన్. అలాగని వాళ్లది లవ్ మ్యారేజ్ ఏం కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లే. తొమ్మిదేళ్లు అవుతోంది. ఐదేళ్ల కూతురు కూడా ఉంది. ఇండస్ట్రీయల్ ఏరియాలో రబ్బర్ ఫ్యాక్టరీ ఉంది అతనికి. నగరంలోని గురునానక్ కాలనీలో ఉంటారు. ఈ బెజవాడ కోడలు అప్పుడప్పుడూ పుట్టింటికి వెళ్లి వస్తుంటుంది. అంటే పాకిస్తాన్కు. ఇటీవలే ఇంట్లో వాళ్లను చూడాలని అనిపించి.. కూతురు సైమరాను తీసుకుని పాక్ వెళ్లింది రజనీ. ఆమె అక్కడ ఉండగానే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. వెంటనే భారతీయులంతా తిరిగి రావాలని ఇండియా ఆదేశించింది. ఇండియన్స్ అంతా వెళ్లిపోవాలని పాక్ సైతం సేమ్ రూల్ పెట్టింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఆ బెజవాడ కోడలి పరిస్థితి ఏంటనే టెన్షన్ మొదలైంది.
పాక్ నుంచి రావమ్మా కోడలా..
భర్తను కాదని పుట్టింట్లో ఉండిపోలేదు. వెంటనే విజయవాడకు వచ్చేయ్ అని భర్త పవన్ చెప్పడంతో.. రజనీ సూట్కేస్ సర్దేసుకుంది. అప్పటికప్పుడు విమాన టికెట్లు ఎక్కడ దొరుకుతాయి. పాక్ గగనతలాన్ని కూడా మూసేసింది. పంజాబ్ అటారీ బోర్డర్ ద్వారా ఇండియాకు తిరిగొచ్చేస్తోంది ఆ పాక్కు చెందిన బెజవాడ కోడలు. భార్యను, కూతురును రిసీవ్ చేసుకోవడానికి పవన్ అమృత్సర్ వెళ్లారు. అటారీ సరిహద్దులో ఫ్యామిలీని కలుసుకున్నాడు. వేరే సందర్భంలో అయితే ఇది కామన్ విషయమే కావొచ్చు. కానీ, పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. ఇలా పాకిస్తాన్ యువతి, మన విజయవాడ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అంశం, ఆమె ఇప్పుడు పాక్లో ఉండటం.. వెంటనే ఇండియాకు తిరిగిరావడం.. ఇలా ఈ ఉదంతం ఆసాంతం ఆసక్తికరంగా మారింది.
కృష్ణా జిల్లా మహిళకు పాక్ పౌరసత్వం
ఇలాంటిదే మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కూడా ఉంది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం సనత్నగర్కు చెందిన ఓ మహిళ.. పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆమెకు పాక్ పౌరసత్వం కూడా వచ్చింది. కొన్నాళ్ల తర్వాత వాళ్లిద్దరికీ గొడవలు వచ్చి విడిపోయారు. ఆ యువతి విజయవాడ తిరిగొచ్చేసి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? పాక్ పౌరసత్వం ఉంది కాబట్టి వెంటనే వెళ్లిపోవాలా? లాంగ్ టర్మ్ వీసా మీద బెజవాడలో ఉంటుండగా అది ఆటోమెటిక్గా రద్దు అవుతుందా? ఇలా అనేక సందేహాలతో తెగ టెన్షన్ పడుతోంది. ఇదే విషయంపై పోలీసులను ఆశ్రయించింది. అయితే, ఆమె పుట్టింది కృష్ణా జిల్లాలోనే కాబట్టి నో ప్రాబ్లమ్.. ఇక్కడే ఉండొచ్చని ప్రస్తుతానికైతే భరోసా ఇచ్చారు. అన్ని పత్రాలు సమర్పిస్తే పరిశీలించి చెబుతామన్నారు.
Also Read : ఏపీలో పాకిస్తాన్ మద్దతుదారులు.. పాక్ జెండాలతో.. రంగంలోకి ధర్మ రక్షాదళ్
పాకిస్తానీయులే కావాల్సి వచ్చిందా?
ఈ రెండు ఘటనల గురించి ఏపీ వాసులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఇటు విజయవాడ అమ్మాయి, పాకిస్తాన్ అమ్మాయి.. అటు పెనమలూరు అమ్మాయి, పాక్ పౌరసత్వం… ఇన్నాళ్లూ వీళ్ల గురించి ఎవరూ పట్టించుకోలేదు కానీ.. పహల్గాం ఉదంతం తర్వాత ఇలాంటి కేసులు కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోతున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతీయులను కాదని.. ఇలా పాకిస్తాన్ పెళ్లిళ్లు ఏంటో అని అవాక్కవుతున్నారు. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్లను ఆదర్శంగా తీసుకున్నారా ఏంటి? అని చర్చించుకుంటున్నారు.