TDP vs YSRCP : బెంగళూరు నుంచి రాప్తాడు వచ్చారు జగన్. పాపిరెడ్డిపల్లి వెళ్లి లింగమయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రెస్మీట్ పెట్టి.. ఆ పోలీసుల గుడ్డలూడదీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ పాలన నడుస్తోందంటూ విమర్శించారు. చంద్రబాబు, పరిటాల సునీత, శ్రీరాంలతో పాటు.. రామగిరి ఎస్సైపైనా ఘాటైన విమర్శలు చేశారు. అనంతరం.. నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. ఇక్కడో చిన్న ఛేంజ్. వచ్చేటప్పుడు హెలికాప్టర్లో ల్యాండ్ అయిన జగన్.. వెళ్లేటప్పుడు మాత్రం రోడ్డు మార్గాన కార్లో బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే.. జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. అద్దం పగిలి డ్యామేజ్ అయిందని అంటున్నారు. ఇదే ఇష్యూపై ఇప్పుడు పొలిటికల్ రచ్చ అవుతోంది.
హెలికాప్టర్ ఎలా డ్యామేజ్ అయింది?
జగన్ పర్యటనకు రాక ముందే పరిటాల సునీత వార్నింగ్ ఇచ్చారు. ప్రశాంత జిల్లాలో చిచ్చు పెట్టొద్దని అన్నారు. తాము తలుచుకుంటే.. జగన్ హెలికాప్టర్ ఇక్కడ దిగకుండా తిరిగి వెనక్కిపంపించే సత్తా తమకుందని చెప్పారు. కానీ, తాము అలా చేయమని.. కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. కట్ చేస్తే.. రాప్తాడులో జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అవగానే వైసీపీ అభిమానులంతా జగన్ను చూసేందుకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ సందర్భంలో హెలికాప్టర్కు డ్యామేజ్ జరిగింది. ఇదీ సంగతి. కానీ దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని.. టీడీపీపై అలగేషన్స్ చేస్తోంది వైసీపీ.
జగన్ జస్ట్ ఎమ్మెల్యే!
హెలికాప్టర్ను డ్యామేజ్ చేసింది టీడీపీ వాళ్లేనని వైసీపీ అంటోంది. తోపుదుర్తి మనుషులే ఆ పని చేసి టీడీపీపై నెపం నెట్టివేస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. పోలీసుల వైఫల్యం అని వైసీపీ అంటోంది. జగన్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఒక డీఎస్పీ, 10 మంది కానిస్టేబుల్స్ కంటే ఎక్కువ భద్రత అవసరమా? అనేది టీడీపీ వాదన.
జగన్పై పోలీస్ యాక్షన్?
జగన్ పర్యటనను పోలీసులు, తమ వాళ్లు ఎక్కడా అడ్డుకోలేదని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేస్తున్నారు. తాము అనుకుని ఉంటే జగన్ ఇక్కడ అడుగు కూడా పెట్టలేడని పరిటాల సునీత అన్నారు. తనను, తన కుమారున్ని టార్గెట్ చేయడానికే జగన్ వచ్చాడని చెప్పారు. మాజీ సీఎంగా ఉండి.. పోలీసులను గుడ్డలూడదీస్తానని చెప్పడం నీచంగా ఉందన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు స్పందించాలని.. జిల్లా ఎస్పీ తగు చర్యలు తీసుకోవాలని సునీత డిమాండ్ చేశారు.
జగన్పై సునీత సెటైర్లు
జగన్ పరామర్శకు వచ్చాడా? ఎన్నికల ప్రచారానికి వచ్చాడా? చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకున్నాడంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే సునీత. అసలు జగన్ నవ్వుతున్నాడో, ఏడుస్తున్నాడో కూడా అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేశారు. జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని.. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టును.. పేపర్లు చూసి చదివాడని అన్నారు.
Also Read : మీ బట్టలూడదీస్తా.. పోలీసులకు జగన్ వార్నింగ్
తల్లికి, చెల్లికి న్యాయం చేయలేదు కానీ…
పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య అనుకోకుండా జరిగిన సంఘటన అని సునీత అన్నారు. పులివెందులలోని బాత్ రూముల్లో చంపేందుకు కొడవండ్లు ఉపయోగిస్తారని.. చిన్నాన్నని చంపారని.. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్.. ఇక్కడకు వచ్చి ఏం చేస్తాడని ప్రశ్నించారు. గ్రామాల్లో చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నాడని పరిటాల సునీత మండిపడ్డారు.