Pawan Varahi Yatra Postponed: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 27 నుంచి నిర్వహించాల్సిన వారాహి యాత్ర వాయిదా పడింది. ఈ నెల 30 నుంచి కాకినాడ జిల్లా పిఠాపురం వేదికగా పవన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
మార్చి 30 న పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడుని పవన్ కల్యాణ్ దర్శించుకుంటారు. 31న ఉప్పాడ సెంటర్లో వారాహి యాత్ర నిర్వహించి, అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 1న పార్టీలోకి చేరికలు ఉంటాయి. ఆయా నేతలను పవన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తారు. అనంతరం నియోజకవర్గంలోని మేథావులతో సమావేశమై.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఇలా మూడు రోజులపాటు పవన్ కల్యాణ్ పిఠాపురంలోనే బస చేయనున్నారు.
Also Read: పార్టీలకు ఈసీ లేఖ.. 48 గంటల ముందు అప్లై, అలాగైతే ఛాన్స్ !
ఏపీలో మే 13వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి. 27 నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇక టిడిపి ప్రజాగళంతో ప్రజల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలో ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కొత్తరూల్స్ తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్లు, స్టేట్ వైడ్ నాయుకులతోపాటు వీడియో కవరేజ్, వాహనాల అనుమతులను ప్రధాన ఎన్నికల అధికారి వద్ద తీసుకోవాలి. పార్టీల ప్రచార సామాగ్రికి కూడా అనుమతులు తప్పనిసరి. సభలు, సమావేశాలకు 48 గంటల ముందు ఎన్నికల అధికారుల వద్ద అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.