Pakistan Fuel Hike: పాకిస్థాన్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. అక్కడి ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (OGRA) సిఫార్సుల మేరకు సవరించిన ఈ కొత్త ధరలు ఆగస్టు 14 నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో స్వాతంత్రం రోజు కూడా ఈ ధరల బాదుడు ఏంటని పాక్ ప్రజలు వాపోతున్నారు.
పాక్ ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధరపై 45 పైసలు పెరిగింది. దీంతో నిన్నటి వరకు రూ. 324.98గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 325.43కి చేరింది. అటు హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ. 1.16 పెరగ్గా.. ధర రూ. 382.79 నుండి రూ. 383.95కి ఎగబాకింది.
భారత్ తరహాలో పాక్ సైతం ఇటీవల రోజువారీ ఇంధన ధరల నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగానే తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గుల కారణంగా గత జులై నుంచి రోజూవారీ ప్రాతిపదికన ధరలను పాక్ సవరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో గత 7 రోజుల సగటు ఆధారంగానే దేశీయంగా ప్రతిరోజూ ధరలను మారుస్తున్నామని ఆ దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ పేర్కొన్నారు.
ఈసారి పెరిగిన ధరలు స్వల్పంగానే ఉన్నప్పటికీ ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఇది మరింత భారాన్ని మోపనుంది. పెట్రోల్ ధర పెంపుతో పాక్ లోని ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. మరోవైపు డీజిల్ ధరలు పెరగడం వల్ల సరుకు రవాణా వ్యయం పెరిగి నిత్యావసరాల ధరలు మరింత మండే ప్రమాదం ఉంది.
Also Read: సావర్కర్ వివాదంలో ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కేసు క్లోజ్.. రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్!
ఈ ఏడాది పాక్ లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఒక దశలో లీటర్ పెట్రోల్ ధర రూ. 458, డీజిల్ ధర రూ. 520 దాటిపోయాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 100కి పైగా పన్నులు వసూలు చేస్తుండటంతో ఇంధన ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
Also Read: ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?