Posani Krishna Murali: చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా.. అంటారు.. సరిగ్గా ఇప్పుడు పోసాని కృష్ణమురళీకి అది అతికినట్లు సరిపోతుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కాల్షీట్ల కోసం వివిధ స్టేషన్ల పోలీసులు పీటీ వారెంట్లతో క్యూ కడుతున్నారు. పోసానిని ముందు మాకే అప్పగించాలని జైలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వైసీపీ హయాంలో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకున్న పోసాని తర్వాత తనకు జ్ఞానోదయం అయ్యిందని, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. అయినా పోసాని పప్పులు ఉడకలేదు. తాజాగా సీఐడీ పోలీసులు పీటీ వారెంట్తో సీన్లోకి రావడంతో పోసాని రిలీజ్ ప్రశ్నార్ధకంగా మారింది.
ఇదిలా ఉంటే.. పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ కొనసాగుతోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. CID రీజినల్ ఆఫీస్కు తరలించారు. అక్కడే సీఐడీ అధికారులు పోసానిని విచారిస్తున్నారు. పోసాని కృష్ణమురళిని ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది గుంటూరు కోర్టు.
దీంతో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు.. పోసానిని సీఐడీ కస్టడీకి తీసుకొని ప్రశ్నించనుంది. న్యాయవాది సమక్షంలోనే పోసానిని సీఐడీ విచారించనుంది. కాగా, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని. మరోవైపు ఇవాళ పోసాని బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది.మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించి నందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా ఇప్పటికే అన్ని కేసులలో పోసానికి బెయిల్ మంజూరైంది. తాజాగా సీఐడీ పోలీసుల పీటి వారెంట్తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళీ ఏ రేంజ్లో చెలరేగిపోయారో వేరే చెప్పనక్కర్లేదు.. జనసేనాని పవన్కళ్యాణ్తో పాటు ఆయన ఫ్యామిలీని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో పాపులర్ అయిన పోసాని.. పాలిటిక్స్లో డైరెక్ట్గా బూతు ప్రయోగాలతో అసహ్యకరమైన ట్రెండ్కు తెర లేపారు.. తన నోటి దూకుడుతో పవన్, ఆయన భార్య పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తనకు కూడా పెళ్లాం బిడ్డలు ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లు జుగుప్సాకరమైన భాషతో పవన్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆఖరికి రాజకీయాల నుంచి రిటైర్ అయి పద్దతిగా తన సినిమాలు తాను చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిని కూడా పోసాని వదలి పెట్టలేదు. పీఆర్పీతో వ్యాపారం చేశారని, కాపులకు వెన్నుపోటు పొడిచారని అవాకులు, చెవాకులు పేలారు.
వైసీపీ అధికారంలో వుండడంతో అప్పట్లో జనసైనికులు పోసానిపై ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన నాయకుడు మళ్లీ ఫిర్యాదు చేయడంతో కడప జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోనే హైదరాబాద్కు వెళ్లి పోసానిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వైసీపీ గద్దె దిగాక కూడా కొంత కాలం పోసాని తన నోటికి పని చెప్తూనే వచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రిపై తన స్టైల్లో నోరు పారేసుకున్నారు.. ఇంత జరిగాక రెండు నెలల క్రిత మీడియా ముందుకొచ్చి.. తనకు జ్ఞానోదయం అయిందని.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని.. ఇకపై తనకు రాజకీయాలకు సంబంధంలేదని ప్రకటించి సెంటిమెంట్ పండించాలని చూశారు.
టీడీపీ , జనసేన నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు పోసాని క్షమాపణలు కూడా కోరారు. మంత్రి నారా లోకేష్కి తన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందని.. పార్టీలోకి కూడా ఆహ్వానించారనే విషయాన్ని పోసాని గతంలోనే వెల్లడించారు. ఆ క్రమంలో పోసాని క్షమాపణలు కోరడంతో ఆయన ఆరోగ్య రీత్యా కేసుల విషయంలో నారా లోకేష్ .. వెయిట్ అండ్ సీ పాలసీ అవలంభిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఓవర్ నైట్ పోసాని ఏపీ పోలీసులకు బుక్ అయ్యారు.
Also Read: టీడీపీ కార్యకర్త హత్య.. పెద్దిరెడ్డి కీలక నిందుతుడు!
కాగా గత వైసీపీ ప్రభుత్వం.. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో గత నెలాఖరులో హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసానిని.. ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో.. ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయితే.. మరో కేసులో ఆయన అరెస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందనుకుంటే సీఐడీ పోలీసుల పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదలకు మళ్లీ బ్రేక్ పడింది. అందుకే అంటారేమో.. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా .. అని