Lift Accident: అపార్ట్ మెంట్లలో ఉండే లిఫ్ట్ లు యమపాశాలుగా మారుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో లిఫ్ట్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు విడిచింది. డోర్ తెరిచి ఉండగానే లిఫ్ట్ ఒక్కసారిగా కిందకి కదలడంతో లిఫ్ట్ కు ఫ్లోర్ కు మధ్య మహిళ ఇరుక్కొని తీవ్రంగా గాయపడింది. అపార్ట్ మెంట్ వాసులు అప్రమత్తమై బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
బాధితురాలిని 50 ఏళ్ల వనితగా గుర్తించారు. ఆదివారం రోజున ఈ విషాదకర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కుమార్తె, మనువడితో కలిసి బాధితురాలు లిఫ్ట్ ఎక్కారు. తమ ఫ్లోర్ రాగానే కుమార్తె, మనవడు తొలుత బయటకు వచ్చారు. వనిత కూడా బయకు రాబోతున్న క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ కిందకి కదిలింది. దీంతో ఆమె ప్రమాదకర రీతిలో లిఫ్ట్ కు ఫ్లోర్ కు మధ్యలో చిక్కుకుపోయారు. తీవ్రమైన నొప్పితో విలవిలలాడారు.
ఒంగోలులోని మార్కెట్ సెంటర్ సాయి సూర్య అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కుని స్పృహ తప్పి అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 50 ఏళ్ళ మహిళ మృతి చెందింది… #Ongole #Andhrapradesh pic.twitter.com/vaI3r5gR3V
— citizenspulse (@citizenspulse01) August 20, 2026
బాధితురాలి కేకలు విని.. అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు వెంటనే లిఫ్ట్ వద్దకు పరిగెత్తుకు వవ్చారు. తీవ్రంగా శ్రమించి వనితను బయటకు లాగారు. అనంతరం ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె పరిస్థితి క్షీణించి.. ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో సదరు అపార్ట్ మెంట్ తో పాటు బహుళ అంతస్తు భవనాల్లో నివసించే వారు ఆందోళన చెందుతున్నారు. భవనాల్లోని లిఫ్ట్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లిఫ్ట్ తెరుచుకున్నప్పుడు అది కదలకుండా చేసే సెన్సార్లు విఫలం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: వందేమాతరం రచ్చ.. ఓటు బ్యాంక్ vs దేశ భక్తి.. కాంగ్రెస్ను చీల్చిచెండాడిన అమిత్ షా..!
కాగా, లిఫ్ట్ హఠాత్తుగా కదలడానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్మెంట్లోని లిఫ్ట్కు సకాలంలో సర్వీసింగ్ చేశారా? లేదా? దీని వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా? సాంకేతిక లోపం వల్లే జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: ప్రభుత్వం బంపరాఫర్.. పథకాలు ప్రమోట్ చేస్తే.. ఒక్కో వీడియోకు రూ.లక్ష బహుమానం!