Social Media Influencers: తమ రాష్ట్రంలోని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు బిహార్ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలపై కంటెంట్ రూపొందించే క్రియేటర్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. బిహార్ కేబినేట్ బుధవారం ఆమోదించిన 13 ప్రదిపాదనల్లో ఇది కూడా ఉంది. ఇందులో భాగంగా ‘బిహార్ సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ మీడియా నిబంధనలు – 2026 చట్టంలో కీలక సవరణలను ప్రభుత్వం తీసుకురాబోతోంది.
కొత్త సవరణ ప్రకారం.. ప్రభుత్వ పథకాలపై కంటెంట్ రూపొందించే ప్యానెల్ క్రియేటర్లకు వ్యూస్ ఆధారంగా ఆర్థిక ప్రోత్సహకాలను అందించనున్నారు. వీడియో అప్లోడ్ చేసిన 30 రోజుల వ్యవధిలో వచ్చే ప్రతి ఒక లక్ష వ్యూస్కు రూ. 10,000 చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు. అయితే క్రియేటర్లకు ఇచ్చే గరిష్ట చెల్లింపు పరిమితిని ఒక వీడియోకు రూ. 1 లక్షగా నిర్ణయించారు. ఈ ప్రోత్సాహకాలు నిబంధనలకు లోబడి మాత్రమే మంజూరు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బిహార్ సమాచార, పౌర సంబంధాల శాఖ (IPRD) త్వరలోనే ఈ నిబంధనలకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. సంక్షేమ పథకాలను ప్రమోట్ చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్, పేజీలు, ఛానెళ్ల ఫాలోవర్ల సంఖ్యను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అర్హులైన వారికే ప్రయోజనాలు అందేలా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ఈ వ్యవస్థ కృషి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.
Also Read: కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. దిల్లీలోని పాక్ హైకమిషన్పై బుల్డోజర్ యాక్షన్!
మరోవైపు ఇదే కేబినేట్ లో మీటింగ్ లో మరో కీలక నిర్ణయం బిహార్ ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో ఏఐ ఆధారిత ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి ‘తైయో ఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ (Taiyo AI India Pvt Ltd) తో అవగాహన ఒప్పందానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి నాంది పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వల్ల ఐటీ రంగానికి ఊతం లభించి.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు!