Kangana Ranaut: బాలీవుడ్ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut), యోగా గురు బాబా రామ్ దేవ్ (బాబా Ramdev) ల మధ్య తీవ్రమైన వాగ్వాదం చెలరేగింది. యువతను ఉద్దేశించి కంగనా చేసిన ‘జెనరేషన్ గట్టర్’ వ్యాఖ్యలపై బాబా రామ్ దేవ్ ఘాటుగా స్పందించగా, దానికి కంగనా అంతే పవర్ఫుల్గా కౌంటర్ ఇచ్చారు. “నా వ్యక్తిగత జీవితం గురించి పగటి కలలు కనొద్దు” అని హితవు పలుకుతూ ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రీసెంట్గా జరిగిన జెన్ జెడ్ (Gen Z) విద్యార్థుల నిరసనలపై కంగనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ, సమాజానికి ఏమీ ఇవ్వలేని కొంతమంది యువతను ఆమె ‘జెనరేషన్ గట్టర్’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కంగనా స్పందిస్తూ, తాను అందరినీ అనలేదని.. డ్రగ్స్, అనైతిక పనులకు అలవాటు పడి నిరసనల్లో అసభ్య పదజాలం వాడిన కొందరిని మాత్రమే ఉద్దేశించి అన్నానని క్లారిటీ ఇచ్చారు.
ఒక మీడియా ఇంటర్వ్యూలో కంగనా వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా బాబా రామ్ దేవ్ తీవ్రంగా మండిపడ్డారు. “అసలు ఆమె అర్హత ఏంటి? ఆమె చిన్నతనం, జవానీ (యువతరం) ఎలా గడిచాయో, గతంలో ఆమె చేసిన పనులు ఏంటో అందరికీ తెలుసు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ యువతను గట్టర్ అనడం విపరీతమైన మనస్తత్వానికి నిదర్శనమని, దీనిపై ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చురకలంటించారు.
బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలకు కంగనా సోషల్ మీడియా వేదికగా బలమైన కౌంటర్ ఇచ్చారు. “బాబాజీ.. నా జవానీ గురించి, బెడ్ రూమ్ గురించి పగటి కలలు కనడం మానేయండి. గాసిప్స్, పుకార్ల ఆధారంగా ఎవరైనా ఊహించుకోవచ్చు. కానీ నాపై ఎలాంటి ఫ్రాడ్ కేసూ లేదు.. అబద్ధపు ప్రకటనలు ఇచ్చి సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న చరిత్ర నాది కానే కాదు” అంటూ పతాంజలి బ్రాండ్పై గతంలో సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేస్తూ నేరుగా దాడి చేశారు.
also read: నల్లగా ఉన్నావంటూ అవమానించారు.. ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన కామాక్షి!
ఆధారాలు లేని పుకార్లను నమ్మి నాకు క్యారెక్టర్ బుద్ధులు చెప్పకండి అని కంగనా స్పష్టం చేశారు. “మీకంటే నా క్యారెక్టర్ చాలా బెటర్, ఇక్కడ ఎలాంటి మోసం లేదా ఫ్రాడ్ నమోదు కాలేదు” అని ఎద్దేవా చేశారు. పతాంజలి ఉత్పత్తుల విషయంలో సుప్రీం కోర్టుకు రామ్ దేవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న యోగా గురు, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఎంపీల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎప్పుడూ తన సూటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా, ఈసారి కూడా వెనక్కి తగ్గకుండా ఇచ్చిన ఈ పంచ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.