Bangalore: ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు మంత్రి లోకేష్. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపారు. దేశంలో పేరు పొందిన దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. బెంగుళూరు సిటీలోని మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి నారా లోకేష్. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటరులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.
టీసీఎస్-ఐబీఎం-ఎల్ అండ్ టీ సంస్థల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలో ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మరో ఆరునెలల్లో ఆవిష్కృతం కాబోతోందన్నారు. భారత్ సాంకేతిక విప్లవంలో ఇదొక గేమ్ ఛేంజర్గా నిలుస్తోందని మనసులోని మాట బయపెట్టారు.
విశాఖ సిటీ ఐటీ హబ్గా మారుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం గురించి వివరించారు.
ALSO READ: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్స్.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు
అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్నఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్ షోలో లోవ్స్ ఇండియా ఎండి అంకుర్ మిట్టల్, రోల్స్ రాయ్స్ వైస్ ప్రెసిడెంట్ హరిహరన్ గణేశన్, శాక్స్ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మధు నటేశన్, జెసి పెన్నీ ఇండియా ఎండి కౌశిక్ దాస్, లులూ లెమన్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ మైసూర్, డెల్టా ఎయిర్ లైన్స్ డైరెక్టర్ సైఫ్ అహమ్మద్ షరీఫ్, విక్టోరియా సీక్రెట్ వైస్ ప్రెసిడెంట్ వసుధారిణి శ్రీనివాసన్ ఉన్నారు.
వీరితోపాటు నసుని ఇండియా సీనియర్ డైరెక్టర్ పెద్దరెడ్డెప్ప, ఎఎన్ జె సిఎఫ్ఓ కవితా రమేష్, ఆస్ట్రల్ ల్యాబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివానంద కోటేశ్వర్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ సిఇఓ లలితా ఇంద్రకంటి, ఏపీ ఐటి శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఈ భేటీలో ఉన్నారు.
రీసెంట్గా విజయవాడ వేదికగా క్వాంటమ్ వ్యాలీ వర్క్షాపు జరిగింది. అందులో చేసిన డిక్లరేషన్పై ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. అందులో క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణలు, మౌళిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రయార్టీ ఇవ్వనుంది. దేశంలో అతి పెద్ద క్వాంటమ్ బెడ్గా క్వూ చిప్ ఇన్ను రాబోయే ఏడాదిలో అమరావతి ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెల్సిందే.