Severe Heat Waves Alert for AP&Telangana : దేశంలో భిన్నవాతావరణం నెలకొంది. రాజధాని ఢిల్లీలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని, అలాగే ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై గంటకు 25-35 కిలోమీటర్ల వేగంతో జల్లులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. శుక్రవారం ఢిల్లీ, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడంతో.. వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.
కాగా.. దేశంలో మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతుంది. తీవ్రమైన ఎండలకు తోడు వేడిగాలులు ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదురోజుల్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read : దంచికొడుతున్న ఎండలు.. హాఫ్ సెంచరీ దిశగా భానుడు
రాయలసీమ, ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, తూర్పు ఉత్తరప్రదేశ్లో 26 నుంచి 28 తేదీల్లో, కేరళ, మహేలలో 27 నుంచి 29 తేదీల్లో, కొంకణ్, మధ్య పశ్చిమ ఉత్తరప్రదేశ్, కోస్తా, యానాంలలో 28 నుంచి 30 తేదీల్లో అతితీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. ఐదురోజులపాటు గతంలో ఎన్నడూ చూడనంత వేడి తప్పదని హెచ్చరించింది.
తెలంగాణలోని కొన్నిజిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. శుక్రవారం అత్యధికంగా జమ్మికుంటలో 45.6 డిగ్రీలు, వరంగల్, నల్గొండ కరీంనగర్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు ప్రైవేట్ టీర్, కూలీ మరణించినట్లు అధికారులు తెలిపారు.