Sharmila on YS Bharati: అమరావతి మహిళలను కించపరిచేలా.. సాక్షి ఛానెల్లో చర్చలు జరపడం దారుణమన్నారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. అమరావతి మహిళలకు సాక్షి టీవీ ఛైర్పర్సన్ భారతీరెడ్డి, జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానికి వ్యతిరేకంగా సాక్షి ఛానల్లో మాట్లాడటం అవమానకరమన్నారు. సాక్షి పత్రిక, ఛానెల్ ప్రజా సమస్యల్ని విస్మరించి YCPకి ప్రచారం చేస్తున్నాయని, ప్రజా సమస్యల్ని విస్మరించిన మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ను నల్లపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నల్లపాడు పీఎస్కు ఆయనను తరలించారు. రాత్రంతా నల్లపాడు పీఎస్లోనే కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నారు. ఇవాళ కొమ్మినేనిని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చనున్నారు.
అయితే కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల చుట్టూ రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటా పోటీగా మాటల యుద్ధానికి దిగారు. మరోవైపు దీనిపై అమరావతి మహిళలు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. వైసీపీ నేతల తీరుపై బగ్గుమంటున్నారు. వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై కక్ష కట్టి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్, భారతి రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు సాక్షి టీవీలో అమరావతి మహిళలపై అవమానకర వ్యాఖ్యల్ని ఏపీ , టీజీ MSO ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొమ్మినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ను ఫెడరేషన్ ఖండిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. నాగరిక సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు సమాజాన్ని బాధించేవిగా ఉన్నాయంది. ఈ రకమైన మాటలు తెలుగు మహిళలపై దాడిగా పరిగణిస్తున్నామంటూ ప్రకటనలో తెలిపింది. అమరావతి మహిళలకు సంఘీభావంగా నిలుస్తున్నామని ఏపీ , టీజీ MSO ఫెడరేషన్ తెలిపింది. ప్రజా చర్చలో బాధ్యతతో ఎవరి మనోభావాలను దెబ్బతినకుండా వ్యవహరించాలని కోరింది.
Also Read: వయసు డ్రామా.. అడ్డంగా దొరికిపోయిన కొమ్మినేని
కాగా.. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్పై జగన్ రియాక్ట్ అయ్యారు. కొమ్మినేని అరెస్టు కక్షసాధింపే అన్నారు. డిబేట్లో వ్యక్తులు మాట్లాడే మాటలకు.. యాంకర్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సాక్షి మీడియాపై కావాలనే దాడులు చేస్తున్నారన్నారు. కొమ్మినేనిని చంద్రబాబు గతంలోనూ టార్గెట్ చేశారని ఎక్స్ వేదికగా విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత అన్నింటికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని.. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో.. రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందన్నారుజగన్.