Amaravati News: వైసీపీ రూటు మార్చిందా? రాజకీయ నేతలను వదిలేసి అధికారులను టార్గెట్ చేసిందా? అధినేత జగన్ సహా నేతలంతా ఇదే పంథాను కంటిన్యూ చేస్తున్నారా? నేరుగా పోలీసులు రంగంలోకి దిగారా? సాక్షి పత్రికపై కేసు నమోదు వెనుక అసలేం జరిగింది?
ఏపీలో అధికారం పోయిన తర్వాత విలవిలలాడుతోంది వైసీపీ. పవర్లో ఉన్నమాదిరిగా వ్యవహరించడం మొదలుపెట్టింది. నేతలు, కార్యకర్తలను అధికార పార్టీపైకి వదిలింది. ఇది జరుగుతుండగా ఆ పార్టీ అధికారిక గెజిట్ ‘సాక్షి పత్రిక’ తన పని తాను చేసుకుపోతోంది. దాని ఫలితమే ఆ పత్రికపై ఏకంగా పోలీసులు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
పైసా మే ప్రమోషన్ పేరుతో సోమవారం సాక్షి పత్రికలో ఓ కథనాన్ని ప్రచురించింది. డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు లంచాలు అడిగారన్నది అసలు పాయింట్. దీని వెనుక ఏపీ డీజీపీ హరీష్గుప్తా ఉన్నారంటూ తాటికాయంత అక్షరాలతో ఓ కథనం ప్రచురించింది. సాక్షి రాతలు గమనించిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.
ఉన్నట్లుండి ఇదేంటి తమ మీద ఇలాంటి రాతలు రాస్తున్నారని కొందరు అధికారులు చర్చించుకున్నారు. ఇది కంటిన్యూ అయితే తమకు మరింత చెడ్డ పేరు వస్తుందని భావించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏపీ పోలీసు అధికారుల సంఘం సాక్షి పత్రికపై తాడేపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ALSO READ: సీఎం బాబు@30… సాక్షిలో ఊహించని ప్రచారం
ఫిర్యాదు గమనించిన తాడేపల్లి పోలీసులు సాక్షి ఎడిటర్, ఏపీ బ్యూరో చీఫ్, ఏపీ క్రైం రిపోర్టర్లను నిందితులుగా పోలీసులు చేరుస్తూ కేసు నమోదు చేశారు. నేరపూరిత కుట్ర, ఇరువర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజలను పక్కదారి పట్టించేలా రాసుకొచ్చారంటూ వాటి కింద అభియోగాలు మోపారు. అందులోని అంశాలన్నీ అసత్యాలని పేర్కొన్నారు.
పోలీసులు, ఉన్నతాధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో తప్పుడు కథనాన్ని ప్రచురించారని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అందులో ప్రస్తావించారు.
ఇటీవలకాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. వారిని భయపెట్టేందుకు ఈ విధంగా చేస్తోందని అంటున్నారు. ఆ మధ్య మాజీ సీఎం జగన్ సైతం పోలీసు అధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం రాగానే సప్త సముద్రాల అవతలున్నా తప్పు చేసిన అధికారులను తీసుకొచ్చి శిక్షిస్తామని పలుమార్లు మీడియా సమావేశంలో ప్రస్తావించిన సంగతి తెల్సిందే. గత టీడీపీ రూలింగ్లో ఇలాంటి కథనాలను వండివార్చింది సాక్షి. అప్పటి చంద్రబాబు సర్కార్ లైటుగా తీసుకోవడంతో 2019 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకున్న విషయం తెల్సిందే.