Cases on Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఈనెల 18 నుంచి 21 వరకు మంచి రోజులు వుండడంతో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రమంతా ఎన్నికల వాతావరణం నెలకొంది.
నామినేషన్లతోపాటు అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరుస్తున్నారు. అలాగే తమపై పోలీసు కేసుల జాబితాను బయటపెడుతున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏకంగా 22 కేసులు నమోదయ్యాయి. 2019కి ముందు కేవలం రెండు కేసులు ఉండగా, గడిచిన ఐదేళ్లలో ఆ సంఖ్య 22 కి చేరింది. తొమ్మిది జిల్లాలో ఆయనపై కేసు నమోదయ్యాయి. వీటిలో మంగళగిరి సీఐడీ పోలీస్ ష్టేషన్లో ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
చంద్రబాబుపై కడప జిల్లా అన్నమయ్య, తూర్పుగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో రెండేసి కేసులు ఉన్నాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల ఒక్కోటి చొప్పున కేసులున్నాయి. చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. 1989 నుంచి 2019 వరకు జరిగిన ఏడు ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు విజయం సాధించారు. ఎనిమిదోసారి బరిలో ఉన్నారు.
Also Read: వివేకా హత్యకేసులో వ్యాఖ్యలు.. షర్మిలకు ఈసీ నోటీసులు
పనిలోపనిగా చంద్రబాబు తన ఆస్తులను అఫిడవిట్లో పేర్కొన్నారు. చంద్రబాబు ఆస్తులు 36.36 కోట్లు కాగా, భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల రూపాయలుగా ప్రస్తావించారు. అందులోని హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో రెండు కోట్లకు పైగా షేర్లు ఉన్నాయి. వాటి విలువ దాదాపు 763.93 కోట్ల రూపాయలు. అయితే చంద్రబాబుకు బంగారం అనేది లేదు, కేవలం అంబాసిడర్ కారు మాత్రమే ఉంది.