Telugu Desham Party Changed 4 Candidates in these Constituency: తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చింది. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్ఛార్జుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. అభ్యర్థులను మార్చడంతో.. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా.. ఎంపీ స్థానం బీజేపీకి వెళ్లిన విషయం తెలిసిందే. రఘురామకు టికెట్ ఇవ్వాలని బీజేపీని కోరినా.. తగ్గేది లేదని చెప్పడంతో.. రఘురామకు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం.
గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ.. రఘురామ కోసం ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి తప్పించింది. మరోవైపు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. మొదట పైలా ప్రసాదరావుకు టికెట్ కేటాయించింది. కానీ.. సర్వేలో ఆయన వెనకబడ్డారని తెలియడంతో.. ఆ టికెట్ ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించింది.
Also Read: YSRPC compare BRS: గంటా సంకేతాలు, ఎన్నికల తర్వాత అదే పరిస్థితి
శ్రీ సత్యసాయిజిల్లా మడకశిర లోనూ అభ్యర్థిని మార్చాలని టీడీపీ యోచిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం.. ప్రస్తుత అభ్యర్థి అయిన అనిల్ కుమార్ ను మార్చాలని డిమాండ్ చేస్తుంది. దాంతో ఆ టికెట్ ను దళిత విభాగ రాష్ట్ర అధ్యక్షుడైన ఎంఎస్ రాజుకు ఇచ్చే యోచనలో పడింది అధిష్ఠానం. ఈయనకు తొలుత బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలనుకున్నా వీలుకాలేదు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా టీడీపీ మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రచారంలో వెనుకబడటంతో పాటు.. ప్రత్యర్థితో వ్యాపార లావాదేవీలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలతోనే జయచంద్రారెడ్డికి ప్రత్యామ్నాయంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్ భార్య సరళారెడ్డి లేదా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, కొండా నరేంద్ర పేర్లు వినపిస్తున్నాయి. అభ్యర్థి మార్పుపై నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది.