Amaravati News: H-1B వీసా మార్పులపై టెక్ కంపెనీల ఆలోచన మారుతోందా? అమెరికాలో అయితే మనుగడ సాధించలేమని డిసైడ్ అయ్యాయా? అమెరికాలో ఉంటూనే భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు టెక్ కంపెనీలు సిద్ధమయ్యాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఏపీలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. దీనివల్ల 12 వేల ఉద్యోగాలు రానున్నాయి.
టెక్ కంపెనీలు భారత్పై దృష్టి సారించాయి. కొత్తగా అప్లై చేసుకునే హెచ్ 1 బీ వీసాలకు భారీగా రుసుము పెంచడంతో టెక్ కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. అదే జరిగితే తమ కంపెనీలకు ఫ్యూచర్ ఉందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ వైపు పలు కంపెనీలు ఫోకస్ చేశాయి. ముఖ్యంగా టైర్ 1 సిటీపై దృష్టి కేంద్రీకరించాయి.
ఈ నేపథ్యంలో టెక్ కన్సల్టెన్సీ సంస్థ ‘యాక్సెంచర్’ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖలో కొత్తగా క్యాంపస్ పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. తమ ప్రాజెక్టు ద్వారా సుమారు 12 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. అందుకోసం 10 ఎకరాల భూమి కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరింది.
టెక్ కంపెనీలకు ఇటీవల కేటాయించిన విధానంలో తమకు భూమి కేటాయించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ వారం లేకుంటే వచ్చేవారంలో ప్రభుత్వం ఆమోదం తెలపడం ఖాయమని తెలుస్తోంది. యాక్సెంచర్ సంస్థను తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు ఓ అధికారి. కంపెనీ ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు.
ALSO READ: రెచ్చిపోయిన హిజ్రాలు.. నర్సుపై మూకుమ్మడిగా దాడి
క్యాంపస్ ఏర్పాటుకు యాక్సెంచర్ ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటుందో అనేది ఇంకా స్పష్టంగా తెలియదన్నారు. యాక్సెంచర్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 3 లక్షల మందికి పైగా భారత్లో ఉన్నారు. విశాఖలో ఐటీకి హబ్గా మధురవాడ కేరాఫ్గా మారింది. ఇప్పటివరకు దాదాపు 150 ఐటీ కంపెనీలు ఉన్నట్లు ఓ అంచనా.
ఇటీవల చంద్రబాబు సర్కార్ పరిశ్రమల కోసం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీ పారిశ్రామికవేత్తలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెద్ద కంపెనీలకు ఎకరా భూమి 99 పైసలకు ఇవ్వనుంది. దీన్ని టెక్ కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. ఇప్పటికే టీసీఎస్ క్యాంపస్ విస్తరణకు 22 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. అలాగే కాగ్నిజెంట్ టెక్ కంపెనీకి మధురవాడలో 22 ఎకరాలు ఓకే చేసింది.
ఏఐ-క్లౌడ్ డేటా సెంటర్ల ఏర్పాటుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థకు ఆనందపురం మండలంలో 80 ఎకరాలు కేటాయించనుంది. ఇప్పుడు యాక్సెంచర్ సంస్థ వంతైంది. భూమి, అద్దె, వేతనాల కోసం తక్కువ ఖర్చులను సద్వినియోగం చేసుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు భారత్లో చిన్న నగరాల వైపు దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.