AP : వాడు మామూలోడు కాదు. ఎస్సై, గ్రూప్స్ కోచింగ్తో పెంచుకున్న తన నాలెడ్జ్, ఫిట్నెస్ అంతా ఉగ్రవాదం కోసం వాడాడు. సోషల్ మీడియా, సిగ్నల్ యాప్స్ను సమర్థవంతంగా యూజ్ చేసుకున్నాడు. అందుకే, విజయనగరంలో సిరాజ్ స్కెచ్ వేస్తే.. సౌదీలోని టెర్రరిస్ట్ హ్యాండ్లర్లే ఉలిక్కిపడ్డారంటే మామూలు విషయం కానే కాదు. NIA విచారణలో అనేక సంచలన విషయాలు బయటపెట్టాడు సిరాజ్. మొదటి మూడు రోజులు ఎంక్వైరీలో నోరు మెదపకపోయినా.. ఆ తర్వాత ఒక్కో నిజం బయటపెడుతూ వచ్చారు సిరాజ్, సమీర్.
పరారీలో సిరాజ్ టీమ్
అహిం గ్రూపుతో సొంతంగా ఓ ఉగ్రవాద సంస్థనే స్థాపించాడు సిరాజ్. అతని గ్రూపులో 20 మంది సభ్యులు ఉన్నారు. వాళ్లంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లు. దేశ వ్యాప్తంగా అతని నెట్వర్క్లో స్లీపర్ సెల్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పేద నిరుద్యోగ యువకులే అతని టార్గెట్. సిరాజ్ అరెస్టుతో అతని టీమ్ సభ్యులంతా పరారీలో ఉన్నట్టు గుర్తించారు.
సౌదీ, ఒమన్, పాక్లో..
సౌదీ, ఒమెన్, పాకిస్తాన్ దేశాల్లో టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకొచ్చాడు సిరాజ్. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, వరంగల్.. ఇలా పలు ప్రాంతాల యువకులతో అహిం గ్రూపు తయారు చేశాడు. పాకిస్తాన్కు చెందిన ఓ ముస్లిం ఆర్గనైజేషన్తో లింక్ పెట్టుకున్నాడు. సౌదీ వ్యక్తుల నుంచి సిరాజ్కు పూర్తి సహాయ సహకారాలు అందాయి. దేశంలో బాంబు పేలుళ్లు జరపాలనేది వారి ప్లాన్. అవసరమైతే సూసైడ్ బాంబర్స్ను సైతం రెడీ చేశారు. అయితే, బ్లాస్టింగ్స్ ఎక్కడ జరపాలనే దానిపై సిరాజ్కు, సౌదీ హ్యాండ్లర్లకు మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు విచారణలో తెలిసింది.
విజయనగరంలోనే ఎందుకంటే..
సౌదీ ఉగ్రవాదులేమో హైదరాబాద్లో బాంబులు పేల్చాలని సూచించారట. సిరాజ్ మాత్రం హైదరాబాద్లో వద్దు విజయనగరమే ముద్దు అంటూ వారిని ఒప్పించాడట. ప్రశాంతంగా ఉండే విజయనగరంలో బాంబు పేలుళ్లు జరిగితే.. తమ బలం, అహిం గ్రూపు పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుందని వారిని నచ్చజెప్పాడట. అందుకు, సౌదీ వాళ్లు సైతం ఓకే చెప్పడంతో.. విజయనగరంలో నాలుగు చోట్ల బ్లాస్టింగ్స్ చేసేందుకు సిరాజ్, సమీర్లు రెడీ అయ్యారు. ఇక బాంబులు పేల్చేందుకు టెస్ట్ ట్రయల్స్ చేస్తుండగా దొరికిపోయారు.
Also Read : పెళ్లికొడుకు తలపై కొబ్బరి బొండాంతో ఫసక్..
ఆ 20 మంది కోసం వేట..
ఐదు రోజుల కస్టడీ దగ్గరపడటంతో విచారణ మరింత వేగవంతం చేశారు NIA అధికారులు. మొదటి మూడు రోజులు పెద్దగా ఇన్ఫో రాబట్టలేకపోయారు. ఆ తర్వాత తమదైన స్టైల్లో నిజాలు కక్కిస్తున్నారు. పేలుడు పదార్థాలకు ఆర్ధిక సహకారం చేసిన ఇమ్రాన్ అక్రమ్ పరిచయంపై NIA ఆరా తీస్తోంది. ఢిల్లీకి చెందిన సాహిబ్, జషీన్ ఎవరు? వారికి ఎవరితో లింక్స్ ఉన్నాయనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. అసలు సౌదీ హ్యాండ్లర్లు అనే మాట తప్ప.. వారు ఎవరు అనేది ఇంతవరకు తెలియలేదు. ఆ దిశగా సిరాజ్, సమీర్లను ప్రశ్నిస్తున్నారు. విచారణలో కొత్తవారి పేర్లు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే పనిలో ఉంది NIA. ప్రస్తుతం పరారీలో ఉన్న అహిం గ్రూపు సభ్యులైన 20 మంది కోసం గాలిస్తున్నారు.