AP Elections 2024:రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ గడువు ముగిసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. చిన్న చిన్న ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు గాను 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 4,210 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లకు ఉపసంహరణకు అవకాశం ఉంది.
కాగా, రేపటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది. అయితే మే 13న ఒకే విడతలో రాష్ట్రవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఈసీ అధికారికంగా వెల్లడించనుంది.