Tirumala News: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం నుంచి మొదలు కానున్నాయి. మార్చి 9 నుంచి ప్రారంభమై, 13 వరకు జరగనున్నాయి. ప్రతి రోజు రాత్రి ఏడు నుంచి గంటపాటు స్వామి-అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు.
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభం అవుతాయి. పౌర్ణమి వరకు తెప్పోత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి పుష్కరిణిని అందంగా డెకరేట్ చేశారు. తెప్పచుట్టూ నీటి జల్లులు పడేలా రెడీ చేశారు. తెప్పోత్సవాల అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు.
ఏమిటీ విశిష్టత
తెప్ప అనగా పడవ లేదా ఓడ. ఓడలో ఆశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్ని తెప్పోత్సవం అని చెబుతారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాళ్ పేరుతో పిలుస్తారు. తెలుగులో తెప్ప తిరునాళ్లు అంటారు.
ఏమిటీ చరిత్ర
తిరుమలలో తెప్పోత్సవాలు ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయి. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించారు. ఈ తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారని చెబుతున్నారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా నిర్వహించినట్టు చెప్పుకొచ్చారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో స్వామివారిని ఊరేగిస్తారు. ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.
ALSO READ: పోసానితో ఫుల్బాల్.. బెయిల్ వచ్చినా జైల్లోనే
ఏ రోజు ఎవరెవరు?
తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై దర్శనమిస్తారు. పుష్కరిణిలో మూడు సార్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు. రెండో రోజు మార్చి 10న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై విహరిస్తారు. మూడో రోజు మార్చి 11న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు పుష్కరిణిలో విహరిస్తారు. భక్తులను కనువిందు చేయనున్నారు. నాలుగు, ఐదు రోజు మార్చి 13న ఏడు సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఐదు రోజులపాటు జరగనున్న తెప్పోత్సవాలకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. కోనేటిలో శ్రీవారి విహారం సమయంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు అధికారులు. శ్రీవారి తెప్పోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. మార్చి 9, 10న సహస్ర దీపాలంకార సేవ, మార్చి 11, 12, 13న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది.
శ్రీవారి భక్తులకు అలర్ట్
టీటీడీ అధికారులు త్వరలో ఈకేవైసీ విధానం అమల్లోకి రానుంది. రూ. 300 ప్రత్యేక దర్శనం, వివిధ రకాల ఆర్జిత సేవలు సహా అన్ని రకాల టికెట్లు, టోకెన్ల జారీ వసతి భవన సముదాయాల్లో గదుల బుకింగ్లో ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థ అమలులోకి రానుంది.
టికెట్ల, వసతుల విషయంలో దళారుల జోక్యాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ విధానాన్ని అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి సర్కార్. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను దేవాదాయం శాఖ కార్యదర్శి వినయ్ చంద్ జారీ చేశారు.
ఆధార్ అథెంటికేషన్, ఈ-కేవైసీ విధానాన్ని అమలు చేయాలంటూ టీటీడీ కొత్త పాలక మండలి నవంబరు 18న తీర్మానం చేసింది. అంతకంటే ముందే ఆధార్ అథెంటికేషన్కు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ ఈవో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.
తాజాగా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ అమలు విధానం కేంద్రం పరిధిలో ఉన్నందున ఈ అనుమతులను తీసుకోవడం తప్పనిసరి.