కర్నాటకలో రోడ్లు బాగోలేవనే ప్రచారం జరుగుతోంది.
అక్కడ ఉన్న కంపెనీలను మౌలిక వసతులు బాగా ఉన్న ఏపీకి రావాల్సిందిగా మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సొంత రాష్ట్రం తమిళనాడు.
కానీ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం ఆయన ఏపీని ఎంపిక చేసుకున్నారు.
జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కర్నాటక-తమిళనాడుతో పోటీ పడి మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంపెనీలను ఎగరేసుకు వెళ్తోందనే విషయం రుజువైంది. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏపీలో మాత్రమే కూటమి ప్రభుత్వం ఉంది. దాని వల్లే ఆ రాష్ట్రానికి ఎక్కువ మేలు జరుగుతుందనే భావనను తమిళనాడు-కర్నాటక వాసులకు అర్థమయ్యేలా చెబుతున్నారు కూటమి నేతలు. ఈ విషయంలో ప్రధాని మోదీని మంత్రి నారా లోకేష్ మెప్పించారనే చెప్పాలి. ఆ మధ్య బెంగళూరు ఐటీ కంపెనీని ఏపీకి ఆహ్వానిస్తూ రాజకీయ అలజడి రేపిన లోకేష్, తాజాగా తమిళనాడు అసెంబ్లీలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో జరిగిన చర్చపై పరోక్షంగా స్పందిస్తూ మరింత సంచలనం సృష్టించారు. తమిళనాడు ఎన్నికల వేళ ఈ చర్చ బీజేపీకి మరింత లాభం చేకూర్చేలా ఉంది.
లోకేష్ వ్యూహం..
వాస్తవానికి కర్నాటక వ్యవహారాల గురించి ఏపీ మంత్రి లోకేష్ స్పందిస్తారని అనుకోలేం. కానీ లోకేష్ స్పందన కర్నాటక ప్రభుత్వాన్ని ఎంత డ్యామేజ్ చేసిందో, అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని కూడా అంతే హైలైట్ చేసినట్టయింది. బ్లాక్ బక్ అనే స్టార్టప్ కంపెనీ సీఈవో రోడ్లపై గుంతలు ఉన్నాయని, గంటల తరబడి సమయం వాటి వల్ల వృధా అవుతోందని ఆమధ్య ఓ ట్వీట్ పెట్టారు. వెంటనే రియాక్ట్ అయిన నారా లోకేష్ ఆ స్టార్టప్ సీఈవోను ఏపీకి ఆహ్వానించారు. ఆ తర్వాత అది మరింత రచ్చగా మారింది. స్టార్టప్ కంపెనీల యజమానులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్ మండిపడ్డారు. అయితే ప్రజల ఫిర్యాదులను బ్లాక్ మెయిల్ లాగా చూడకూడదని, వాటిని సమస్యలుగా భావించి పరిష్కరించాలని లోకేష్ కౌంటర్ ఇవ్వడం కొసమెరుపు. ఆ తర్వాత మరోసారి కూడా కర్నాటక గుంతల రోడ్లపై లోకేష్ పరోక్షంగా కామెంట్లు చేశారు. ఇటీవల గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖకు రావడం పట్ల కర్నాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ అతి ఎక్కువ రాయితీలిచ్చిందన్నారు. దీనికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఆహారం స్పైసీ అని చాలామంది అంటుంటారని, అయితే ఏపీ పెట్టుబడులు కూడా అలాగే ఉన్నాయని, కొంతమంది పొరుగు వారికి వీటిని చూసి మండుతున్నట్టుందని సెటైర్లు పేల్చారు.
They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbours are already feeling the burn! 🌶️🔥 #AndhraRising #YoungestStateHighestInvestment
— Lokesh Nara (@naralokesh) October 16, 2025
తాజాగా తమిళనాడుపై కూడా ఇలాగే సెటైర్లు పేల్చారు మంత్రి నారా లోకేష్. గూగుల్ సంస్థ ఏపీలో ఏఐ డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో వస్తున్న నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. తమిళనాడుకి చెందిన సుందర్ పిచాయ్ సీఈవోగా ఉన్న గూగుల్ కంపెనీని ఇక్కడికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదని తమిళనాడు ప్రతిపక్షనేత ప్రశ్నించారు. దీనిపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎందుకంటే ఆయన భారత్ను ఎంచుకున్నారని ట్వీట్ చేశారు. ఇక్కడ భారత్ అంటూ ఎన్డీఏ కూటమిని హైలైట్ చేశారు లోకేష్.
He chose Bharat 🇮🇳 https://t.co/hASGC1Mz8F pic.twitter.com/bcT72KeZRd
— Lokesh Nara (@naralokesh) October 21, 2025
పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో ఎక్కువ అవకాశాలున్నాయని, ఏపీ ఎక్కువ కంపెనీలను ఆకర్షిస్తోందనే విషయం ఇక్కడ హైలైట్ అవుతోంది. అదే సమయంలో ఏపీకి ఎన్డీఏ కూటమి అండదండలున్నాయనే విషయాన్ని కూడా పరోక్షంగా నేతలు ప్రస్తావిస్తున్నారు. ఏపీతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఈ వ్యవహారాలన్నీ మేలు చేస్తున్నాయి. అందుకే ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్ ని ప్రధాని మోదీ మరింత దగ్గరకు తీస్తున్నారు. ఆయన్ను మెచ్చుకుంటూ ట్వీట్లు వేస్తున్నారు.
Also Read: కేసీఆర్ – జగన్.. వారిద్దరికీ అదో తుత్తి