Tirumala News: హెచ్ఎంపీవి అనే కొత్త రకమైన వైరస్ ప్రబలుతున్నట్లు వార్తల నేపధ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక సూచన చేశారు. ఈ నెల 10 వ తేదీ నుండి తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండ టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవల కొత్త రకం వైరస్ ప్రబలుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఛైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు.
తిరుమలలో అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనం గూర్చి మాట్లాడుతున్నారన్నారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 10 వ తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని, వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానున్నట్లు చైర్మన్ తెలిపారు.
టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని, 10 వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం కదులుతుందన్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజులు రద్దు చేసినట్లు మరోమారు ఆయన పునరుద్ఘాటించారు.
టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫార్సు లేఖల దర్శనాలను సైతం రద్దు చేశామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట వేస్తామని, సీఎం చంద్రబాబు అదేశాల ప్రకారం సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసామని తెలిపారు.
Also Read: TTD News: టీటీడీ సీరియస్.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
మైసూరు నుంచి వచ్చిన నిపుణులతో చేసిన పుష్పాలంకరణలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, 3 వేల సీసీ కెమరాలతో నిఘా ఉంటుందన్నారు. గోవిందమాల భక్తులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండదని, అందరు భక్తులతో కలిసి ఎస్ఎస్డి టోకన్లు తీసుకొని వైకుంఠద్వార దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. టోకెన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరని.. కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు ఛైర్మన్ సీరియస్ అయ్యారు. తిరుమలకు వచ్చే భక్తులను ఎవరు ఆపరు.. ఆపలేరని, అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మవద్దని భక్తులను చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు.