TTD action against priests: కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ అర్చకులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలను అతిక్రమించి, అధికారుల నుండి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా రాజకీయ నేతలను కలిసినందుకు ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
ఒంటిమిట్ట ఆలయానికి చెందిన అర్చకులు ఎ. శ్రావణ్కుమార్, వీణా మనోజ్కుమార్, కె. పార్థసారథి ఇటీవల పులివెందులకు వెళ్లారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి, ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను జగన్కు అందజేశారు.
సాధారణంగా టీటీడీ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే అర్చకులు గానీ, సిబ్బంది గానీ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. అయితే, ఈ అర్చకులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పులివెందుల పర్యటనకు వెళ్లడంపై టీటీడీ యంత్రాంగం సీరియస్ అయింది.
అర్చకుల అత్యుత్సాహంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒంటిమిట్ట ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి (Deputy EO) ఎ. ప్రశాంతి, సదరు ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రొటోకాల్ పాటించకుండా, అనుమతి లేకుండా బయట వ్యక్తులకు ఆలయ మర్యాదలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ నోటీసులకు సంబంధించి రెండు రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేవారు. అయితే, ఇప్పుడు అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో, ప్రోటోకాల్ లేకుండా అర్చకులు నేరుగా జగన్ నివాసానికి వెళ్లి స్వామివారి ప్రసాదాలు, వస్త్రాలు అందజేయడం టీటీడీలో నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడింది.
Read Also: తమిళనాడు ఎన్నికలు.. ఓటేసిన సెలబ్రిటీలు వీరే!