Tuni politics: తుని రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ-వైసీపీల మధ్య నువ్వానేనా అన్నరీతిలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే వైకుంఠపాలి గేమ్ మొదలైంది. ఎలాగైనా తుని మున్సిపాలిటీని టీడీపీకి దక్కకుండా తీవ్రప్రయత్నాలు చేశారు వైసీపీ మాజీ మంత్రి దాడిశెట్టి. చివరకు టీడీపీ మాజీ మంత్రి యనమల ముందు అవన్నీ చిత్తు అయ్యాయి. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు సుధారాణి.
యనమల ఎత్తుకు చిత్తయిన దాడిశెట్టి
తుని వైసీపీలో ములసం మొదలైంది. ఏం జరిగిందో తెలీదుగానీ, ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు సుధారాణి. సోమవారం ఉదయం మీడియా ముందుకొచ్చిన ఆమె, ఛైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, కౌన్సిలర్గా కొనసాగుతానని ప్రకటన చేశారు. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తుని మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పదవి కన్నేసింది టీడీపీ. మొత్తం 28 మంది సభ్యులు 15 మంది మద్దతు పొందితే వైస్ ఛైర్మన్ పదవి దక్కడం ఖాయం. ఈ క్రమంలో దాదాపు 10 మంది కౌన్సెలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు వెళ్లారు. ఎక్స్ ఆఫీషియో టీడీపీ ఎమ్మెల్యే కావడంతో మరో నలుగురు కౌన్సెలర్లు మద్దుతు టీడీపీకి అవసరమైంది. ఈ క్రమంలో అసలు రాజకీయాలు మొదలయ్యాయి.
వైస్ ఛైర్మన్ పదవి నుంచే
నాలుగు సార్లు వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ-వైసీపీ కౌన్సెలర్ల మధ్య క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగాయి. చివరకు వైసీపీకి చెందిన కౌన్సెలర్లను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఛైర్మన్ ఇంట్లో బంధించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ కార్యకర్తలు అక్కడికి రావడంతో పెద్ద రచ్చ అయ్యింది. ఈ క్రమంలో దాడిశెట్టి రాజాపై దాడి చేసే ప్రయత్నం చేశారు టీడీపీ కార్యకర్తలు.
ALSO READ: ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలపై మాట్లాడుతాం
పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారు. ఇదే క్రమంలో సమావేశానికి కావాల్సిన కోరం లేకపోవడంతో వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు అధికారులు. ఈ వ్యవహారం జరిగి దాదాపు నాలుగైదు రోజులు అయ్యింది. మరి ఏం జరిగిందో తెలీదు ఒక్కసారిగా సోమవారం మీడియా ముందుకొచ్చారు ఛైర్మన్ సుధారాణి.
గతరాత్రి ఏం జరిగింది?
రాజీనామాకు ముందు ఆదివారం రాత్రి ఛైర్మన్ సుధారాణి ఇంట్లో వైసీపీ కౌన్సెలర్లతో సమావేశం జరిగింది. దీనికి ఆ పార్టీకి చెందిన 14 మంది కౌన్సెలర్లు మాత్రమే హాజరయ్యారు. మరో నలుగురు టీడీపీ వైపు వెళ్లినట్టు అంతర్గత సమాచారం. ఇరు పార్టీల బలబలాలు సమానమయ్యాయి. పరిస్థితి గమనించిన ఛైర్మన్ సుధారాణి ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమకు 17 మంది కౌన్సెలర్లు మద్దతు ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారామె. తనను కౌన్సిలర్ గా గెలిపించిన ప్రజల కోసం, పార్టీ కోసం పోరాడుతానని చెప్పారు. తనతోపాటు మిగతా కౌన్సిలర్లను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. తన రాజీనామా లేఖను కమిషనర్కు అందజేశారు సుధారాణి. కావాల్సిన బలం ఉంటే సుధారాణి ఎందుకు రాజీనామా చేశారన్నది అసలు ప్రశ్న.
ఛైర్మన్ సుధారాణి రాజీనామా చేయడంతో తునిలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవులపై టీడీపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ లెక్కన రేపో మాపో మున్సిపల్ సమావేశం జరగనుంది. మరి సభ్యులు ఈసారి ఛైర్మన్ గా ఎవర్ని ఎన్నుకుంటారో చూడాలి.