లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన కీలక నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రాజ్ కేసిరెడ్డిని వారం రోజుల పాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు రోజుల పాటు అతన్ని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు రాజ్ కేసిరెడ్డి విచారణకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఈ విచారణ ద్వారా రాజ్ కేసిరెడ్డి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను రాబట్టాలని సిట్ అధికారులు చూస్తున్నారు.
50 నుంచి 60 కోట్ల వరకు ఎలా వసూలు చేశారు?
మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెలా 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఎలా వసూలు చేశారు? ఈ సొమ్మంతా ఏయే రూపాల్లో ఎవరెవరికి ఇచ్చేవారు? అంతిమంగా ఆ సొత్తు ఎవరికి, ఎలా చేరింది? ఈ మొత్తం కుట్ర రూపకల్పనకు ప్రధాన సూత్రధారి ఎవరు? అంటూ ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు.
సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
కాకినాడ సీపోర్టు కేసులో సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లిక్కర్ స్కాంపై హాట్ కామెంట్లు చేశారు. లిక్కర్ స్కాంపై తనను అడిగితే చాలా విషయాలు చెబుతానంటూ ఎవరికీ తెలియని రాజ్ కేసిరెడ్డిని ఆ కేసులో ఫోకస్ చేశారు. విజయసాయరెడ్డి ఆరోపణలతో ప్రభుత్వానికి కూడా ఓ అస్త్రం లభించినట్లైందని అంటున్నారు. అక్కడి నుంచి రకరకాల ట్విస్ట్ ల మధ్య కేసు విచారణ షురూ అయ్యింది. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అని విజయసాయిరెడ్డి పేర్కొన్న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అవ్వడంతో తేనె తుట్టు కదిలింది.
సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరిగిన కేసిరెడ్డి
లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసిరెడ్డికి అనేక సార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా విచారణకు హాజరుకాకుండా కేసిరెడ్డి డుమ్మా కొడుతూ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతను దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి విజయవాడకు తీసుకువచ్చి రాత్రంతా కూడా సిట్ అధికారులు విచారణ జరిపారు. ఆపై తెల్లారి కూడా మరోసారి కేసిరెడ్డిని విచారించిన సిట్ అధికారులు… ఈ సందర్భంగా కీలక సమాచారం రాబట్టారంట.
ప్రతి దశలోనూ కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి
మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కెసిరెడ్డి ప్రతినెలా రూ.50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి, ఆ సొమ్మంతా నాటి ముఖ్యమంత్రి జగన్కి చేర్చేవారని సిట్ దర్యాప్తులో గుర్తించిందంట. జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ, వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డిల ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్కు అందజేసేవారని నిర్ధారించింది. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా వైసీప ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ తదితరులతో కలిసి నూతన మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ముడుపుల వసూలు వరకూ ప్రతి దశలోనూ రాజ్ కెసిరెడ్డే కీలకంగా వ్యవహరించినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది.
ఆరంభంలో విచారణకు సహకరించని రాజ్ కేసిరెడ్డి
ఈ కేసులో సేకరించిన పలు ఆధారాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు ఇప్పటికే విచారణలో చెప్పిన సమాచారంతో సిట్ అధికారులు అరెస్ట్ తర్వాత రాజ కేసిరెడ్డిని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే తొలుత అధికారులకు కేసిరెడ్డి సహకరించలేదని తెలుస్తోంది. రెండో విడత విచారణలో కొన్ని ఆధారాలతో సిట్ అధికారులు ప్రశ్నించగా.. కొన్నింటికి సమాధానాలు చెప్పగా.. మరికొన్నింటికి తనకు సంబంధం లేదని కప్పదాటు సమాధానాలు చెప్పాడంట. సిట్ విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కేసిరెడ్డి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కేసిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మరోవైపు ఈకేసులో ముందస్తు బెయిల్ కోసం రాజ్ కేసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ కూడా ఆతనికి నిరాశే ఎదురైంది. కేసిరెడ్డి పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
దేశం విడిచి పరారయ్యేందుకు ప్రయత్నించిన కేసిరెడ్డి పీఏ
మరోవైపు మద్యం కుంభకోణంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి పీఎ పైలా దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా సిట్ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సిట్ బృందం అతనికి నోటీసులు జారీ చేసింది. అయితే పోలీసుల ముందు హాజరుకాకుండానే దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు . డిజిటల్, ఫోన్ లోకేషన్ ద్వారా పీఏ కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది. ఈ క్రమంలో దిలీప్ను చైన్నై ఎయిర్పోర్టులో ఉన్నట్లు గుర్తించారు.
డిస్టలరీ యజమానులతో కాంటాక్టులో ఉండే దిలీప్
వెంటనే విజయవాడ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న సిట్ అధికారులు దిలీప్ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లిన సిట్ బృందం.. మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కేసిరెడ్డి పీఏ వద్ద కీలక సమాచారం ఉన్నట్లు సిట్ బృందాలు భావిస్తున్నాయి. కమిషన్లు ఇచ్చే డిస్టలరీ యజమానులతో దిలీప్ కాంటాక్టులో ఉండేవాడని డిస్టలరీ యజమానులు సిట్ బృందానికి ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. రాజ్ కేసిరెడ్డి లిక్కర్ గ్యాంగ్ అంతా కూడా పీఏ చెబితేనే అక్కడి వెళ్లి కమిషన్లు వసూలు చేసే వారని విచారణలో తేలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉండే ఓ కార్యాలయానికి సొమ్ము మొత్తాన్ని చేర్చి ప్రతీ వారం లెక్కలు తేల్చి.. ప్రతీ నెల 50 నుంచి 60 కోట్లను పైవారికి చేర్చేవారంట.
మారు పేరుతో టికెట్ కొని పరారవ్వాలని చూసిన రాజ్ పీఏ
డిస్టలరీ యజమానులకు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎంత ఇండెంట్ ఇచ్చేది.. ఆ ఇండెంట్ నుంచి ఎంత కమీషన్ రావాలో దిలీప్ ఫోన్ చేసి చెబితేనే వారు కమీషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారంట. రాజ్ కేసిరెడ్డి, డిస్టలరీల యాజమాన్యాల మధ్య అనుసంధాన కర్తగా ఉన్న పైలా దిలీప్ను అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆ క్రమంలో దిలీప్ కాల్ డేటాపై సిట్ సమాచారం సేకరించింది. దిలీప్ ఎక్కడుంటాడు.. అతని కదలికలపై నిఘా పెట్టి సిట్ అధికారులు.. మారు పేరుతో టికెట్ కొని చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాలని ప్రయత్నించినట్లు గుర్తించి చైన్నై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ అరెస్ట్, తాజాగా రాజ్ కేసిరెడ్డిని సిట్ కస్టడీకి అనుమతించడంతో వైసీపీలో మరిన్ని పెద్ద తలకాయల భాగోతాలు బయటపడటం ఖాయమంటున్నారు.