GVMC Politics: విశాఖ సిటీ రాజకీయాలు ఓ రేంజ్లో వేడెక్కాయి. మేయర్ పీఠాన్ని కాపాడుకోవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ-బీజేపీ-జనసేనలు ప్లాన్ చేస్తున్నాయి. కార్పొరేటర్లు చేజారిపోకుండా ఉండేలా క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కార్పొరేటర్లను విదేశాలకు తరలిస్తున్నారు.
విశాఖ జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసానికి టీడీపీ సిద్ధమైంది. ఈనెల 19న మేయర్ వెంకట కుమారిపై అవిశ్వాసం పెట్టనుంది. దీనికి సంబంధించి కలెక్టర్కు కార్పొరేటర్లకు లేఖలు పంపారు. తేదీ దగ్గర పడుతుండటంతో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. విశాఖ పీఠాన్ని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. వారం కిందట దాదాపు 27 మంది కార్పొరేటర్లు బెంగళూరుకు తరలించింది వైసీపీ. బెంగళూరులో అధినేత జగన్తో మంతనాలు చేశారు.
మలేషియాకు టీడీపీ కార్పొరేటర్లు
ఈ క్రమంలో టీడీపీ కొత్తగా స్కెచ్ వేసింది. గతరాత్రి 26 మంది కార్పొరేటర్లను మలేషియాకు తరలించింది టీడీపీ. ఈ నెల 18 వరకు వారంతా అక్కడే ఉండనున్నారు. పరిస్థితి గమనించిన వైసీపీ కూడా తమ కార్పొరేటర్లను విదేశాలకు పంపేందుకు ప్లాన్ చేస్తోంది. వైసీపీ క్యాంప్ రాజకీయాలకు మాజీ మంత్రి బొత్స నేతృత్వం వహిస్తున్నారు. కార్పొరేటర్ల డిమాండ్ను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వైసీపీ కార్పొరేటర్లను గురువారం విదేశాలకు పంపాలని నిర్ణయించారు.
శ్రీలంకకు వైసీపీ కార్పొరేటర్లు?
కార్పొరేటర్లను ఎక్కడికి తీసుకెళ్లాలనే దానిప తర్జనభర్జన పడుతోంది వైసీపీ. తొలుత వియత్నాం తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. చివరకు నిమిషంలో అది శ్రీలంకకు మారింది. అయితే వైసీపీ కార్పొరేటర్లలో నలుగురికి పాస్పోర్టు లేదు. దీంతో వాళ్లను ఎక్కడికి తరలించాలనే దానిపై చర్చ మొదలైపోయింది.
ALSO READ: మహిళల న్యూస్ వీడియోస్, డాక్టర్ను చితక్కొట్టిన
ఇదిలావుండగా ఈనెల 20 వరకు కొలంబోలో కార్పొరేటర్లను ఉంచాలని ఆలోచన చేస్తోంది. అవిశ్వాస తీర్మానం తర్వాత 20న విశాఖకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వైసీపీ నేతల మాట. దీనివల్ల అవిశ్వాస తీర్మానం గండం నుంచి బయటపడవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు.
మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు తొలి అడుగులు పడ్డాయి. కలెక్టర్ను కలిసి లేఖలు అందజేశారు టీడీపీ వైపు కార్పొరేటర్లు. అయితే డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కొద్దిరోజులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే డిప్యూటీ మేయర్ మూడు నెలలు ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేశారు. చట్టం ప్రకారం నాలుగేళ్లు పూర్తయితేనే అవిశ్వాసం పెట్టాలి. డిప్యూటీ మేయర్ విషయంలో కూటమి కార్పొరేటర్లు కొద్దిరోజులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పార్టీల బలబలాల విషయానికి వద్దాం. జీవీఎంసీలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 111 మంది ఉన్నారు. కూటమి సంఖ్యా బలం 70 కాగా, సీపీఐ కార్పొరేటర్ స్టాలిన్, భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి కుమార్తె ఓటు తమకు పడుతాయన్న నమ్మకంతో టీడీపీ ఉంది. మేయర్పై అవిశ్వాసానికి 74 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం ఉంది.
మరో ఇద్దరు కార్పొరేటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. అందులో కొందరు కూటమికి టచ్లో ఉండటంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అవిశ్వాసం ఏమోగానీ తాము ఫారెన్ వెళ్లే ఛాన్స్ వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు కార్పొరేటర్లు.