Kakinada PDS rice smuggling: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచాల్సి ఉందా? కాకినాడకు వెళ్తానన్న పవన్ ను అడ్డుకున్నదెవరు? పవన్ పర్యటనతో వెలుగులోకి వచ్చిన ఆ కింగ్ పిన్ ఎవరు? అన్ని కోట్లు గోల్ మాల్ జరుగుతుంటే అధికారులు ఇన్ని రోజులు ఏం చేశారు? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్నాయి.
కాకినాడ పోర్ట్ ఆధారంగా కోట్ల విలువైన రేషన్ బియ్యం సరఫరాను ఇటీవల కాకినాడ కలెక్టర్ అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లు సంయుక్తంగా ఇచ్చిన ఆదేశాలతో కలెక్టర్ మెరుపుదాడులు నిర్వహించారు. భారీ స్థాయిలో రేషన్ ను పట్టుకున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వచ్చారు.
ఇక్కడే నేరుగా పవన్ కళ్యాణ్ కు అడ్డంకులు సృష్టించారట. ఈ మాటలన్నది ఎవరో కాదు పవన్. తాను పోర్టుకు వస్తానంటే అడుగడుగున అడ్డంకులు తగిలాయని, అలాగే కాకినాడ పోర్టు వద్దకు వచ్చినా కూడా.. సీజ్ చేసిన షిప్ వద్దకు తనను తీసుకెళ్లేందుకు కూడా అదే వ్యవహారం సాగిందని పవన్ అన్నారు. అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగిస్తూ.. కోట్లకు పడగలెత్తిన ఆ కింగ్ పిన్ హవా పోర్టులో ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించే రేషన్ బియ్యం ఆఫ్రికా వంటి దేశాల్లో ఏకంగా రూ. 70 లు పలుకుతుందట. ఇదే ఆసరాగా తీసుకున్న ముఠా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో ఏళ్లుగా రేషన్ సామ్రాజ్యాన్ని విస్తరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. కేవలం మూడేళ్లలో రూ. 45 వేల కోట్ల విలువైన రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగినట్లు మనోహర్ తేల్చారు.
నిన్న సీఎం చంద్రబాబు సైతం ఈ ఘటనపై స్పందించి, ఆ కింగ్ పిన్ ఎవరైనా వదిలేది లేదంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ తన పర్యటనలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు. రేపు స్మగ్లర్లు ఇంతటితో ఆగుతారా.. డబ్బులను కక్కుర్తి పడి ఉగ్రవాదులను తీసుకువస్తారుగా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే.. ఆ కింగ్ పిన్ ఎవరనేది ప్రశ్న. ఏకంగా పవన్ అడ్డుకునే స్థాయిలో ఆ కింగ్ పిన్ తెర వెనుక ఉన్నాడంటే.. అతని సామ్రాజ్యం కాకినాడ పోర్టులో పెద్దగా విస్తరించిందని కూడా చర్చలు సాగుతున్నాయి. పవన్ పర్యటనతోనే కాకినాడ పోర్టు వార్తల్లో రావడం, కోట్లలో స్మగ్లింగ్ బయటపడడంతో పవన్ కు భద్రత పెంచాలని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.
Also Read: Puttaparthi Crime News: అక్క లొంగలేదు.. అల్లుడిని చంపాడు.. 24 గంటల్లో నిందితుడి అరెస్ట్
దేశ భద్రతకు సంబంధించిన అంశంగా కేంద్రం సైతం భావించి, అసలు పోర్టులో ఏం జరుగుతుందనే విషయాలను ఆరా తీసినట్లు సమాచారం. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నారనే వేటలో పోలీసులు దృష్టి సారించినా, కింగ్ పిన్ ను కూకటివేళ్లతో కదిలించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కింగ్ పిన్ చరిత్ర త్వరలోనే గుట్టురట్టు కావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. అలాగే కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ లకు ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.