Gudivada Amarnath: వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 18 నెలల కూటమి పాలన ప్రజలకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తూ, ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజంగా మంచి చేస్తేనే మంచి ఔట్పుట్ వస్తుందని, కానీ ప్రస్తుతం ప్రభుత్వ పనితీరులో అలాంటి ఫలితాలు ఎక్కడా కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని జరుగుతున్న భూ కేటాయింపులపై.. అమర్నాథ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖ కంపెనీల ముసుగులో విశాఖలో రియల్ ఎస్టేట్ సంస్థలకు భారీగా భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పరిశ్రమల పేరుతో భూములు ఇచ్చి, వాస్తవానికి రియల్ ఎస్టేట్ దందాలకు మార్గం సుగమం చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో భూములు కొనుగోలు చేసే సంస్థలకు కూడా ఇక్కడ కారుచవుకగా భూములు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.
ఈ భూ కేటాయింపుల వ్యవహారంపై న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇవ్వడమే కాకుండా, వాటి నిర్మాణ వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోందని, ఇలాంటి ఉదాహరణలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని అమర్నాథ్ నిలదీశారు. ఇన్పుట్ అంతా చంద్రబాబు కొడుకుకే ఇచ్చారని ఆరోపిస్తూ, ప్రజలు ఔట్పుట్ అడిగితే అది ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.
18 నెలల పాలనలో ప్రజలు ప్రభుత్వ పనిని మెచ్చుకోవడం లేదని స్వయంగా సీఎం చెప్పడం.. చరిత్రలో ఇదే మొదటిసారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తున్నాయని అన్నారు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తూ, ఆ అప్పులు పెట్టుబడులుగా కూడా కనిపించకపోవడం, ప్రజలకు మేలు చేయకపోవడం కూటమి పాలన వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు.
అప్పులు మాత్రం పెరుగుతున్నాయి కానీ, ప్రజలకు చేసిన మంచి మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఎన్నో మంచి పనులు చేసి చూపించామని, ప్రజల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం నిరూపించిందని అమర్నాథ్ తెలిపారు. కానిస్టేబుల్, డీఎస్సీ నోటిఫికేషన్లు తమ హయాంలోనే ఇచ్చామని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు భూ దోపిడీకి పాల్పడుతున్నారని.. స్వయంగా డిప్యూటీ సీఎం చెప్పడం గమనార్హమని అన్నారు. చంద్రబాబు అధికారులకు క్లాసులు పీకాల్సింది కాదని, తమ పార్టీ నాయకులకు ముందు క్లాస్ తీసుకోవాలని హితవు పలికారు. అవసరమైతే ప్రజలంతా కలిసి చంద్రబాబుకే క్లాస్ పీకాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
Also Read: కాలుకు కాలు తీసి మూల కూర్చోబెడతాం.. చంపేస్తామంటే భయపడం: పవన్ కళ్యాణ్
విశాఖలో భూములన్నీ ఉచితంగా ఇచ్చేసి, అమరావతిని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాగే భూముల దోపిడీ కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అమర్నాథ్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి, విధానాలు మార్చుకోకపోతే తీవ్ర రాజకీయ పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు.