ఏపీలో ఓవైపు సంక్రాంతి పండుగ సంబురాలు జరుగుతుంటే .. ప్రతిపక్ష వైసీపీ మాత్రం అధికారపార్టీపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండక్కి వచ్చిన ప్రజలే లక్ష్యంగా.. ప్రభుత్వంపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నది. గత ప్రభుత్వంలో తాము ఎలాంటి పాలన అందించాం..ఇప్పుడు పాలన ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని వైసీపీ నేతలు ప్రచారం మొదలెట్టారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారం మొదలెట్టినట్టు కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు.తాము ప్రజలకోసం తీసుకొచ్చిన నవరత్నాల స్కీంను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదని.. విమర్శలు మొదలెట్టారు.
తమ హయాంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం జగన్ అప్పులు చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని ఆరోపించారని.. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ఏపీ.. సింగపూర్ అవుతుందా? అని వైసీపీ స్పోక్స్ పర్సన్, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.ఇదే విషయాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఠారెత్తిస్తున్నారు. జగన్ ఐదేండ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులు చేస్తే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రూ.3.02 లక్షల కోట్ల అప్పులు చేశారని మాజీ మంత్రి విమర్శించారు. అప్పుడు జగన్ చేసిందే, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారని.. కొత్తగా ఏమి చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కూటమి సర్కార్ చేసిన అప్పులపై వైసీపీ అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతలు తమదైన పద్ధతిలో జవాబులిస్తున్నారు. అసలు జగన్ అప్పులు చేసి రాజధాని అభివృద్ధి చేశారా? ప్రాజెక్టులు కట్టారా? మూడు రాజధానుల పేరిట కాలయాపన చేశారు తప్పా? పూర్తిగా ఏది చేశారంటూ ప్రశ్నిస్తున్నారు.చేసిన అప్పులు సంక్షేమం పేరిట ఉచితాలకే సరిపోయిందని.. అభివృద్ధి శూన్యమని గుర్తుచేస్తున్నారు. మంత్రులు సైతం అభివృద్ధిని గాలికొదిలేశారని.. కేవలం దోచుకుని దాచుకోవడం తప్పా జగన్ హయాంలో జరిగిందేమీ లేదని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఐదేండ్ల కాలంలో జగన్ చేసింది.. అభివృద్ధి కాదని.. విధ్వంసం అని వైసీపీ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు.
BRS : ఏ ఇంటినీ వదలొద్దు.. కేడర్కు బీఆర్ఎస్ ఆదేశాలు!
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వేసిన ఫౌండేషన్ స్టోన్.. జగన్ ఐదేండ్ల పాలనలోనూ అలాగే ఉందని.. అమరావతిలో సగం నిర్మాణ దశలో ఉన్న భవంతులను అసలు పట్టించుకోలేదని.. ఫలితంగా ఆ ప్రాంతం నిర్మానుషంగా మారిందని గుర్తుచేస్తున్నారు.మరల కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కేంద్ర సహకారంతో ఆగిపోయిన పనులను చంద్రబాబు మరల ప్రారంభించారని.. పరిశ్రమలు, కంపెనీలు వస్తున్నాయని.. అభివృద్ధి వేగంగా జరుగుతోందని.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని కూటమి నేతలు గుర్తుచేస్తున్నారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబు అని.. ఈ విషయంలో జగన్కు ఆయనకు పోలిక లేదని తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. జగన్ అనగానే కేవలం విధ్వంసమే ఏపీ ప్రజలకు గుర్తుకువస్తుందని, నేటికి వారు ఈ విషయాన్ని మర్చిపోలేదని అంటున్నారు.