న్యూఢిల్లీ, స్వేచ్ఛ: కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న ఆమె, ఇది భవనం మాత్రమే కాదు కాంగ్రెస్ లెగసీ అని పేర్కొన్నారు. ‘‘ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం. గత చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది.
భారత దేశ పునాదులు, శ్రమ, మొత్తం ఇక్కడ కనిపించాయి. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశం కోసం చేసిన త్యాగం. ఈ దేశం కోసం పునాదులు వేసింది. కాంగ్రెస్ సారథ్యంలో రాజ్యాంగం రూపొందింది. ప్రతి కార్యకర్తకు, ఈ దేశ పౌరులకు శుభాకాంక్షలు’’ అని అన్నారు. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన ఫొటోలు ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.
పాదయాత్ర ఫొటోలు కొత్త కార్యాలయంలో పెట్టడం చూస్తుంటే వైఎస్ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు. కొత్త ఏడాదిలో ప్రారంభించుకున్న ఈ నూతన భవనం నుంచే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ధీమా వ్యక్తమవుతోందని చెప్పారు. ఇక, ఆర్ఎస్ఎస్ ముఖ్యనేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మోహన్ భగవత్ను ఉద్దేశించి మండిపడ్డారు షర్మిల.
‘‘1947లో స్వాతంత్య్రం రాలేదని అన్నారు. రామ మందిరం కట్టినప్పుడే స్వాతంత్ర్యం అని చెప్పారు. ఇవి దేశ ద్రోహం మాటలు. టెర్రరిస్ట్ వాఖ్యలు. దేశ ప్రజలు దీనిపై ఆలోచన చేయాలి. ఈ మాటలను గమనించాలి. వీళ్ళ వ్యవహారం టెర్రరిజంలా ఉంది. ఆలోచన తీరు ఎలా ఉందో ప్రజలు తెలుసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్కు స్వాతంత్ర్య పోరాటానికి సంబంధం లేదన్న ఆమె, ఆనాటి విషయాలను గుర్తు చేశారు. ఆ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర, శ్రమ ఏమీ లేదన్నారు. దేశం కోసం పోరాటం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఈ దేశం కోసం పోరాటం చేస్తున్నారని, ఆయన టీమ్లో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్టు చెప్పారు.
రాహుల్ గాంధీతో భేటీ
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు షర్మిల. ఏపీలో పార్టీ బలోపేతంపై ఇద్దరూ చర్చించారు. తాజా రాజకీయ పరిస్థితులపైనా మాట్లాడుకున్నారు. రాహుల్తో భేటీకి సంబంధించిన ఫోటోను ఎక్స్లో షేర్ చేసిన షర్మిల, పార్టీ బలోపేతంతోపాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిపారు.