YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తన అన్న, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా సరే దిగజారే వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్సార్ను తీవ్రంగా విమర్శించిన మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానుడు ఎలా అయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సీఎం జగన్ మంత్రి వర్గంలో ఉన్నవాళ్లంతా గతంలో తన తండ్రి వైఎస్సార్ను తిట్టిన వాళ్లేనని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో జగన్ను ఉరివేయాలని అన్నారని ఒకప్పటి మాటలను వైఎస్ షర్మిల గుర్తు చేశారు. వైఎస్సార్ ఓ తాగుబోతు అన్నాడని.. తన తల్లి విజయమ్మను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. అలాంటి వ్యక్తులకు మాత్రమే జగన్ పెద్దపీట వేశారని, తండ్రిని తిట్టిన వాళ్లంతా ఇప్పుడు అతనికి తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు అయ్యారంటూ విమర్శించారు.
Also Read: Jagan comments Botsa tears: కంటతడి పెట్టిన బొత్స, కారణం అదేనా?
జగన్ రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా సరే దిగజారు తారనేదానికి ఇదే నిదర్శనమని అన్నారు. జగన్ కోసం పాదయాత్రలు చేసిన వారంతా అతనికి ఏమి కారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కోసం పని చేసి.. గొడ్డలిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు ఏం కారని అన్నారు. వైఎస్సార్ పార్టీలో వైఎస్సార్ లేరని విమర్శించారు. వై అంటే.. వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని వైసీపీకి కొత్త అర్థాన్ని వైఎస్ షర్మిల చెప్పారు.