ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. సాధారణంగా ప్రతిపక్షం అంటే అడుగడుగునా అధికార పార్టీ నిర్ణయాల్ని విమర్శిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జరిగేది కూడా అదే. కానీ ఆ విమర్శల వల్ల ప్రతిపక్ష వైసీపీకి ఏమైనా లాభం ఉందా అనేదే అనుమానం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రెడ్ బుక్ వ్యవహారంపై ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేసింది వైసీపీ. ఎన్డీఏ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఒకేతాటిపైకి తెస్తామంటూ హడావిడి చేసింది. చివరకు ఇద్దరు ముగ్గురు జాతీయ నేతలు మినహా ఇంకెవరూ ఆ ధర్నాకు హాజరు కాలేదు. రాగా పోగా వైసీపీ చేసిన పోరాటం వృథాగానే మిగిలిపోయింది. ఏపీలో అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే, దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టడమేంటని టీడీపీ వేస్తున్న ప్రశ్నలకు వైసీపీ నుంచి సరైన సమాధానం లేదు. తాజాగా వైసీపీ నేతలు విశాఖలో ధర్నాకు సిద్ధమవుతున్నారట. ఈమేరకు వైసీపీ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పడ్డాయి. కీలక నేతలెవరూ ఈ ధర్నా గురించి మాట్లాడకపోయినా.. విశాఖలో వైసీపీ స్థానిక నేతలు కాస్త హడావిడి చేయడానికి రెడీ అయ్యారు.
ఎందుకీ ధర్నా..?
విశాఖ పట్నంలోని క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ అనే పేరుని తొలగిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమేరకు తొలగింపు కార్యక్రమం కూడా జరిగిపోయింది. దీంతో వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. వైఎస్ఆర్ ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా అవమానించిందని అంటున్నారు. ఈమేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ థర్నా చేస్తామని చెప్పారు. గురువారం విశాఖలో వైఎస్సార్ అభిమానులు, వైసీపీ నేతలు ధర్నా చేపడతారని వైసీపీ సోషల్ మీడియా నుంచి పిలుపునిచ్చారు. అయితే విశాఖలో అసలు గొడవ ఇంకోటి ఉంది. విశాఖ కార్పొరేషన్లో కొంతమంది కార్పొరేటర్లు గోడదూకుతున్న నేపథ్యంలో అక్కడ హడావిడి చేసేందుకు వైసీపీకి ఇది మరో అవకాశంగా మారింది. దీంతో విశాఖ కేంద్రంగా వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి.
విశాఖ ప్రగతికి రాచబాటలు వేసిన వైయస్ఆర్ ను కూటమి సర్కారు తీవ్రంగా అవమానించింది. విశాఖ లోని వైయస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. వైయస్ ఆనవాళ్లు చెరిపేసే ఈ కూటమి ప్రభుత్వం కుట్రను ప్రజలకు తెలియజెప్పేందుకు… pic.twitter.com/9yeUnz7knH
— YSR Congress Party (@YSRCParty) March 19, 2025
జగన్ వస్తారా..?
విశాఖలో జరగబోతున్న ధర్నాకు వైసీపీ అధినేత జగన్ వస్తారా లేదా అనేది మాత్రం డౌటే. ఎందుకంటే.. ఇటీవల వైఎస్సార్ పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా జగన్ పెద్దగా స్పందించలేదు. వైజాగ్ క్రికెట్ స్టేడియం వ్యవహారంలో కూడా ఆయన నేరుగా మాట్లాడలేదు. మరి ఈ ధర్నాకు జగన్ వస్తారా లేదా అనేది సందేహమే. జగన్ వస్తేనే ఆ ధర్నాకు కాస్తో కూస్తో జనం నుంచి స్పందన వస్తుంది. లేదంటే కేవలం పార్టీ నేతలే హడావిడి చేసి సైలెంట్ అయిపోతారు.
ఇటీవల ఫీజు పోరు, యువత పోరు అంటూ వైసీపీ హడావిడి చేయబోయి ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఫీజు బకాయిలు ఇవ్వాలంటూ వైసీపీ రోడ్డెక్కింది. అయితే ఆ బకాయిలు తమ హయాంలో పెట్టినవేనంటూ కూటమి కౌంటర్ ఇచ్చింది. ఫీజు పోరు అనే పేరుని కూడా తర్వాత యువత పోరు అని మార్చుకున్నారు. తీరా ఆ యువత పోరు ధర్నాలో వయసైపోయిన వారు పాల్గొన్నారంటూ టీడీపీ కౌంటర్లిచ్చింది. అందర్నీ తీసుకొచ్చి యువతపోరు అంటే ఉపయోగమేంటని చాలామంది లాజిక్ తీశారు. టోటల్ గా ఈ యువతపోరు ఫెయిలైందనే విమర్శలొచ్చాయి.
ఇప్పుడు కొత్తగా విశాఖ ధర్నాతో వైసీపీకి ఉపయోగం ఉంటుందా లేదా అనేది అనుమానమే. జనాల్లోకి వెళ్లిన ప్రతిసారీ వైసీపీ తాను అనుకున్నంత సక్సెస్ కాలేకపోయిందనే వాదన వినపడుతోంది. అదే సమయంలో సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రభుత్వాన్ని సరిగ్గా టార్గెట్ చేయలేక పోతుందనే వాదన కూడా ఉంది. మరి రాబోయే రోజుల్లో వైసీపీ తన ప్రతిపక్ష పాత్రను ఎంత సమర్థంగా నిర్వహిస్తుందో చూడాలి.