Avinash Reddy: రాయలసీమలో జేయస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభం కావడంపై వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదొక శుభపరిణామమని పేర్కొన్నారు. అయితే జేయస్ డబ్ల్యూ సంస్థను తానే తెచ్చినట్లుగా సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నట్లు అవినాష్ విమర్శించారు. 2023లోనే వైఎస్ జగన్, జిందాల్ తో కలిసి స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వం సహకారం వల్లే స్టీల్ ప్లాంట్ కల సాకారం అయిందని సజ్జన్ జిందాల్ ట్వీట్ చేశారని గుర్తు చేశారు. ఈ ట్వీట్ తో సీఎం చంద్రబాబు పరువు పోయిందంటూ ఎద్దేవా చేశారు.
2007 కాంగ్రెస్ హయాంలోనే బ్రహ్మణీ స్టీల్ కు అప్పటి సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డి శంఖు స్థాపన చేశారని ఎంపీ అవినాష్ గుర్తుచేశారు. వైఎస్ మరణం వరకూ రూ.122 కోట్ల పనులు సైతం జరిగాయన్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప్రారంభించినట్లు గుర్తు చేశారు. 2023లో రాయలసీమ స్టీల్ కు 3 వేల ఎకరాల భూమి కేటాయించి జేయస్ డబ్యూ స్టీల్ ప్రారంభించామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి నాడు జీవో సైతం జారీ చేసినట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన ఇన్సెంటీవ్ సైతం అందించినట్లు తెలిపారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన అన్ని చర్యలను గత జగన్ ప్రభుత్వం తీసుకున్నట్లు ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. గండికోట నుంచి 2 TMCల నీటిని సైతం కేటాయించినట్లు చెప్పారు. రహదారి కోసం రూ.30 కోట్లు, స్టీల్ కోసం మరో 640 ఎకరాల భూసేకరణ, పర్యావరణ అనుమతులు ఇలా అన్ని వైసీపీ హయాంలోనే జరిగినట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వం సహకారం వల్లే స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందన్న విషయాన్ని సజ్జన్ జిందాల్ ట్వీట్ తో అర్థమైపోతోందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభ అనంతరం జగన్ ను దూషించడానికే చంద్రబాబు సభ పెట్టారని ఎంపీ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: సిక్ లీవ్స్పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!
స్టీల్ ప్లాంట్ పై ఎంత క్రెడిట్ చోరీ చేసినా.. జగన్ గురించి ప్రజలకు తెలుసని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం ఎవరు ఎంత చేశారో వారు గ్రహించారన్నారు. అటు అమరావతి గురించి ప్రస్తావిస్తూ.. అసలు అది ప్రజా రాజధాని కాదని గతంలో పవనే అన్నారని అవినాష్ పేర్కొన్నారు. ‘అమరావతి ఒక వర్గానికి చెందిన రాజధాని, ధనికుల రాజధాని అని విమర్శించారని చెప్పారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను పవన్ ఇప్పుడు మర్చిపోయారంటూ మండిపడ్డారు. మరోవైపు తమపై విమర్శలు చేస్తున్న ఆదినారాయణ రెడ్డికి సైతం అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు.