Sick Leave: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జర్మనీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కార్మికుల సెలవులపై కఠిన నిబంధనలను తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం.. 34 ఆర్థిక సంస్కరణలను ప్రతిపాదించింది. అందులో ఓ నిర్ణయం.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగులు అనారోగ్యం కారణంగా ఒక రోజు సెలవు తీసుకున్నా.. యజమాన్యం డాక్టర్ సర్టిఫికేట్ను అడగవచ్చు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. మూడు రోజుల వరకు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా సెలవు తీసుకునే వెసులుబాటు ఉండగా.. దానికి ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. .
జర్మనీ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో సాగుతోంది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన నష్టం, ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాల ప్రభావం, పెరిగిన ఇంధన ధరలు, చైనా నుండి వస్తున్న పోటీ వంటి కారణాల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దేశంలో శ్రామిక శక్తి ఉత్పాదకతను పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయవచ్చని ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భావిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలలో ఉద్యోగుల గైర్హాజరీ రేటు చాలా ఎక్కువగా ఉండటం దేశ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
జర్మనీలో ఇప్పటివరకూ ఫోన్ ద్వారా డాక్టర్ను సంప్రదించి వారం రోజుల పాటు అనారోగ్య సెలవుల పత్రాన్ని (Sick Note) పొందే అవకాశం ఉండేది. అయితే ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దీనిని పరిమితం చేయనుంది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా వైద్యుడిని నేరుగా కలిసి పరీక్షించుకున్న తర్వాతే సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ‘మేం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలుసు. కానీ ఉద్యోగుల గైర్హాజరీల వల్ల దేశానికి జరుగుతున్న నష్టాన్ని ఇకపై భరించలేం’ అని ఛాన్సలర్ మెర్జ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
జర్మనీలో ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు ఒక అనారోగ్య సమస్యకు గరిష్టంగా ఆరు వారాల పాటు వేతనంతో కూడిన లీవ్స్ (Paid Sick Leave) తీసుకోవచ్చు. ఒకవేళ మరో కొత్త ఆరోగ్య సమస్య వస్తే.. మళ్లీ 6 వారాల పెయిడ్ లీవ్స్ లభిస్తాయి. ఇది కాకుండా జర్మనీలో చాలా మంది ఉద్యోగులకు సాధారణంగానే ఏడాదికి ఆరు వారాల వార్షిక సెలవులు (Vacation Time) కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని దుర్వినియోగం చేస్తూ ఉద్యోగులు ఎక్కువ కాలం సెలవుల్లో గడుపుతున్నారని.. తద్వారా కంపెనీల లాభాలకు గండీ కొడుతున్నారని యాజమాన్యాలు గత కొంతకాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: ‘TRS’ పేరు కుదరదు.. కొత్త పేరు చూస్కోండి.. కవితకు ఈసీ అల్టిమేటం!
ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే సిక్ లీవ్స్ కఠినతరం కానున్నాయి. యజమాని కోరితే అనారోగ్యం సోకిన తొలి రోజు నుంచే ఉద్యోగులు.. డాక్టర్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. మెడికల్ ప్రూఫ్ లేకుండా ఇంట్లోనే ఉండే పద్ధతికి స్వస్తి పలకాల్సి వస్తుంది. కేవలం ఫోన్ కాల్స్ ద్వారా పొడిగించిన సెలవులను పొందడం ఇకపై కష్టతరం కానుంది. మొత్తంగా బ్యూరోక్రసీని తగ్గించి.. పారదర్శకతను పెంచడం ద్వారా జర్మనీని మళ్లీ స్థిరమైన వృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
Also Read: ఉడికించిన బంగాళాదుంపలతో చేసే రుచికరమైన స్నాక్ రెసిపీలు.. 5 నిమిషాల్లో రెడీ