Hyundai 1 Million Connected Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్లో టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. కార్లలో కేవలం ఇంజిన్, డిజైన్, మైలేజీ మాత్రమే కాకుండా కనెక్టెడ్ ఫీచర్లకు కూడా వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక లక్ష్యాన్ని ప్రకటించింది. 2027 నాటికి దేశంలో 10 లక్షల కనెక్టెడ్ కార్ల అమ్మకాలను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం భారత రోడ్లపై హ్యుందాయ్కు చెందిన 8 లక్షలకు పైగా కనెక్టెడ్ కార్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ బ్లూలింక్ టెక్నాలజీకి వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణ ఈ వృద్ధికి కారణం అయ్యింది. AI ఆధారిత బ్లూలింక్ ప్లాట్ ఫామ్ ద్వారా కారును మొబైల్ ఫోన్ తో అనుసంధానం చేసుకోవడంతో పాటు పలు స్మార్ట్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. బ్లూలింక్ లో 70కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ గా కారును పర్యవేక్షించడం, వెహికల్ స్టేటస్ తెలుసుకోవడం, లొకేషన్ ట్రాక్ చేయడం, గత ప్రయాణాల వివరాలు చూడటం, రిమోట్ కమాండ్లు ఇవ్వడం లాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే హ్యుందాయ్ పే ద్వారా చెల్లింపులు చేయడం, డిజిటల్ కీ, డిజిటల్ పాస్ పోర్ట్, రిమోట్ ఇమ్మొబిలైజర్లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
బ్లూలింక్లో AI ఆధారిత వాయిస్ కమాండ్లకు కూడా మద్దతు ఉంది. ఐదు భాషల్లో 450కి పైగా వాయిస్ కమాండ్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీంతో డ్రైవింగ్ సమయంలో కొన్ని ఫీచర్లను వాయిస్ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ కీలక వివరాలు వెల్లడించారు. వినియోగదారుల అవసరాలు మారుతున్నాయని, కార్లలో సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. 2027 నాటికి 10 లక్షల కనెక్టెడ్ కార్ల లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు సాఫ్ట్ వేర్ బేస్డ్ వెహికల్స్ అభివృద్ధిపై కంపెనీ దృష్టి పెట్టిందన్నారు.
ముఖ్యంగా కంపెనీ తీసుకురానున్న కొత్త మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో అన్ని వేరియంట్లకు నెక్స్ట్ జనరేషన్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని స్టాండర్డ్ గా అందించనున్నట్లు గార్గ్ వెల్లడించారు. అంటే ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు కనెక్టెడ్ టెక్నాలజీని కూడా విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని హ్యుందాయ్ చూస్తోంది. దేశంలో కనెక్టెడ్ కార్ల ప్రయాణంలో హ్యుందాయ్ 2019లో బ్లూలింక్ ను ప్రవేశపెట్టడంతో కీలక అడుగు వేసింది. ఆ సమయంలో వెన్యూ ద్వారా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. 2019లో హ్యుందాయ్ కార్లలో కనెక్టెడ్ వాహనాల వాటా 4 శాతంగా ఉండగా, 2026 నాటికి అది 20 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది. రాబోయే రోజుల్లో సాఫ్ట్ వేర్, AI, కనెక్టెడ్ టెక్నాలజీ ఆధారంగా కార్ల వినియోగాన్ని మరింత మెరుగుపరచడమే హ్యుందాయ్ లక్ష్యంగా కనిపిస్తోంది.
Read Also: మారుతి సుజుకి నుంచి మరో ఈవీ వచ్చేస్తోంది.. ఏ మోడల్ అంటే?