దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్య స్థాయి తీవ్రమైన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం వాహనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 18 నుంచి BS6-కంప్లైంట్ వాహనాలు మాత్రమే ఢిల్లీలోకి అనుమతించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ బయట రిజిస్ట్రేషన్ అయిన అన్ని BS3, BS4 వాహనాలను నగరంలోకి రాకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది.
ఢిల్లీ పెరుగుతున్న కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి తీసుకుంటున్న అత్యవసర చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు. భారీ వాహనాలు నిబంధనలను పాటించాలని సూచించారు. నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లే ట్రక్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వాహనాలు భారీ జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సదరు వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
అటు పెట్రోల్ పంపులు చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్(PUC) లేని వాహనాలకు ఫ్యూయెల్ పోయకూదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూల్ కూడా గురువారం నుంచి అమల్లోకి రానుంది. పెట్రోల్ బంకులు ఈ నియమాన్ని పాటించాలని సిర్సా ఆదేశించారు. ఢిల్లీలో గత కొన్ని వారాలుగా కాలుష్యపూరిత పొగమంచు కురుస్తుంది. తక్కువ విజుబులిటీ కారణంగా ప్రజల రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కరంగా మారింది. ఢిల్లీ-NCRలోని పెద్ద ప్రాంతాలలో గాలి నాణ్యత చాలా తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ప్రదేశాలలో 400 మార్కును దాటాయి.
అధికారిక సమాచారం ప్రకారం, 101-200 మధ్య AQI సాధారణ స్థాయిగా గుర్తిస్తారు. 201 నుంచి 300 పేలవంగా ఉన్నట్లు భావిస్తారు. 301 నుంచి 400 ఉంటే చాలా పేలవంగా ఉన్నట్లు గుర్తు. అదే 400 కంటే ఎక్కువ ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇటీవలి రోజుల్లో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో AQI స్థాయిలు ప్రమాదకరంగా సీవర్ ప్లస్ థ్రెషోల్డ్ కు దగ్గరగా వచ్చాయి. పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) NCR అంతటా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ IVని అమలు చేసింది. AQI 450కి చేరుకున్నప్పుడు, మించిపోయినప్పుడు కఠినమైన కాలుష్య నియంత్రణ చర్యలను అమలులోకి తెచ్చినప్పుడు స్టేజ్ IV ప్రారంభించబడుతుంది.
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ IV కింద, ఢిల్లీ-NCR అంతటా BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలను రోడ్లపై తిరగకుండా నిషేధిస్తారు. అవసరమైన, అత్యవసర సేవల కోసం ఉపయోగించే వాహనాలకు మాత్రమే మినహాయింపులు ఉన్నాయి. ఈ పరిమితులు అన్ని ప్రైవేట్ వాహన వర్గాలకు వర్తిస్తాయి. దేశ రాజధానిలోకి ప్రవేశించే వాణిజ్య రవాణాకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. CNG, విద్యుత్ శక్తితో నడిచే వాహనాలతో పాటు BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాలకు ఎలాంటి పరిమితులు ఉండవు.
Read Also: ఎంజీ TO టాటా.. ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!