Free MMTS Train Travel: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం మరో అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాన్ని కల్పిస్తుండగా, ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బస్సులలో కేవలం మహిళలకే ఉచిత ప్రయాణం అమల్లో ఉండగా, ఎంఎంటీఎస్ లో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ పథకాన్ని ఒక సంవత్సరం పాటు ట్రయల్ గా అమలు చేసి, తర్వాత దాని ఫలితాలను సమీక్షించి కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీనిపై మరింత చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ పథకం అమలులో భాగంగా, రైల్వేకు వచ్చే ఆదాయ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ.10 కోట్లు ఉండగా, అది ప్రభుత్వమే భరించేలా ప్రతిపాదన ఉంది.
ఇప్పుడు ఎంఎంటీఎస్ సేవలను రోజుకు సుమారు 38,000 నుంచి 42,000 మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. కరోనా ముందు ఇదే సంఖ్య 1.2 లక్షలకు పైగా ఉండేది. అప్పట్లో రోజుకు 120కి పైగా సర్వీసులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 80 నుంచి 88కి పరిమితమైంది. రైళ్ల సంఖ్య తగ్గడం, సమయపాలన లోపించడం వల్ల ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైల్వే అధికారులను కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టమని కోరింది. ముఖ్యంగా పీక్ అవర్స్ లో ఎక్కువ రైళ్లు నడపడం, సమయపాలన మెరుగుపరచడం, స్టేషన్ల సౌకర్యాలను అభివృద్ధి చేయడం లాంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అదనంగా, చివరి మైలు కనెక్టివిటీ కోసం RTC షటిల్ బస్సులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.
ఉచిత ఎంఎంటీఎస్ ప్రయాణ ప్రణాళికను అమలు చేయడానికి ముందు, దక్షిణ మధ్య రైల్వే రైల్వే బోర్డు ఆమోదం అవసరం. ఇందుకోసం ఓ అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదా తయారు చేసి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రైళ్ల సంఖ్య, టైమింగ్స్ పై నిర్ణయాలు రైల్వే పరిధిలోనే ఉంటాయని కూడా స్పష్టం చేసింది. అదే సమయంలో, ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 491.45 కోట్ల బకాయిని కూడా రైల్వే అధికారులు గుర్తు చేశారు. ఉచిత ఎంఎంటీఎస్ ప్రయాణం అనే ఆలోచన ఇప్పటికీ చర్చల దశలోనే ఉంది. అమలు కావాలంటే రైల్వే బోర్డు తుది ఆమోదం అవసరం. అయినప్పటికీ, ఇది అమల్లోకి వస్తే నగర ట్రాఫిక్ తగ్గడంలో, ప్రజలకు సౌకర్యం పెరగడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
Read Also: స్లీపర్ బస్సులు బ్యాన్.. ఏపీ సర్కారు సంచలన నిర్ణయం!