Hyderabad to Chennai Travel: భారతీయ రైల్వే బుల్లెట్ రైలు కనెక్టివిటీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు పనులు కొనసాగుతుండగా, ఇప్పుడు హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని మరిన్ని బుల్లెట్ రైలు కారిడార్లపై దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పూణే మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. భవిష్యత్తులో దక్షిణ భారత ప్రయాణ విధానాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి రైలులో వెళ్లాలంటే సాధారణంగా 12 గంటలకు పైగా సమయం పడుతోంది. విమాన ప్రయాణం వేగంగా ఉన్నప్పటికీ, ఎయిర్ పోర్ట్ కు ముందుగానే చేరుకోవడం, చెక్ ఇన్, సెక్యూరిటీ తనిఖీలు, ట్రాఫిక్ లాంటి కారణాలతో మొత్తం ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ, ప్రతిపాదిత బుల్లెట్ రైలు కారిడార్ అమల్లోకి వస్తే, హైదరాబాద్ నుంచి చెన్నైకి కేవలం 2 గంటల 55 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు.
ఈ బుల్లెట్ రైలు ప్రారంభం అయితే, ఉదయం హైదరాబాద్ లో టిఫిన్ చేసి బయల్దేరితే, మధ్యాహ్న భోజనం సమయానికి చెన్నైకి చేరుకునే అవకాశం ఉంది. ఈ రైలు సర్వీసులు వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే రోజు వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలులో ప్రయాణానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. చాలా మంది రాత్రి బస్సులు, విమానాల ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు. కానీ, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే, ఈ ప్రయాణం కేవలం 2 గంటల 8 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బెంగళూరుకు వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ చేరుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక హైదరాబాద్-పూణే బుల్లెట్ రైలు కారిడార్ ప్రతిపాదనలు కూడా సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం ఈ మార్గంలో రైలులో ప్రయాణానికి సుమారు 8 గంటల 30 నిమిషాలు పడుతోంది. కానీ, హైస్పీడ్ రైలు అమలైతే ఈ సమయం కేవలం 1 గంట 55 నిమిషాలకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే హైదరాబాద్ భవిష్యత్ హైస్పీడ్ రైలు నెట్ వర్క్ లో కీలక కేంద్రంగా మారవచ్చని సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో హైస్పీడ్ రైలు హబ్ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ బుల్లెట్ రైలు రూట్లు అమలులోకి వస్తే, చిన్న దూరాల విమాన ప్రయాణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే రైల్వే స్టేషన్లు నగరాలకు దగ్గరగా ఉండటం, చెక్ ఇన్ సమయం తక్కువగా ఉండటం, సౌకర్యవంతమైన ప్రయాణం వంటి కారణాలతో ప్రజలు బుల్లెట్ రైళ్లను ఎక్కువగా ఎంచుకునే అవకాశం ఉంది.
Read Also: ఇండియన్ బుల్లెట్ ట్రైన్ రెడీ.. గంటకు స్పీడ్ ఎంతో తెలుసా?