Hyundai Sales May 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా మరోసారి తన జోరు కొనసాగించింది. 2026 మే నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో ఏకంగా 47,837 కార్లను అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే 9.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెరుగుతున్న డిమాండ్, పలు మోడళ్లు, ముఖ్యంగా ఎస్యూవీ విభాగంలో మంచి ఆదరణ లభించడంతో అమ్మకాలు జోరందుకున్నాయి.
హ్యుందాయ్ అమ్మకాల్లో క్రెటా కీలక పాత్ర పోషిస్తోంది. సక్సెస్ ఫుల్ మోడళ్లలో క్రెటా ముందుంది. అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో క్రెటా ఇప్పటికీ మంచి డిమాండ్ ను కొనసాగిస్తోంది. దీనితో పాటు గ్రాండ్ i10 నియోస్, ఆరా, i20, ఎక్స్టర్, వెన్యూ, వెర్నా, అల్కాజార్ లాంటి మోడళ్లు కూడా కంపెనీ అమ్మకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కూడా హ్యుందాయ్ సత్తా చాటుతోంది. క్రెటా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 లాంటి మోడళ్లతో కంపెనీ ఈవీ మార్కెట్లో తన జోరు కొనసాగిస్తోంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్ లో దూకుడు కొనసాగిస్తోంది. వినియోగదారులను దృష్టిని ఆకర్షిస్తోంది.
మే నెలలో దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా కంపెనీకి మంచి ఫలితాలను అందించాయి. ఒకే నెలలో 13,300 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. దీంతో దేశీయ విక్రయాలు, ఎగుమతులు కలిపి మొత్తం 61,137 యూనిట్లకు చేరింది. మొత్తం అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే 4.1 శాతం వృద్ధి నమోదైంది.
2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ బలమైన వృద్ధి కొనసాగుతోందని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ఏప్రిల్, మే నెలలను కలిపి చూస్తే దేశీయ అమ్మకాలు 99,739 యూనిట్లకు చేరుకున్నాయని, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 13 శాతం ఎక్కువ అన్నారు. అయితే, మార్కెట్లో పోటీ కూడా గట్టిగానే ఉంది. ముఖ్యంగా టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు ఎస్యూవీ విభాగంలో దూకుడుగా ముందుకు వస్తున్నాయి. అయినప్పటికీ ఎక్స్టర్, వెన్యూ, క్రెటా లాంటి మోడళ్లతో హ్యుందాయ్ వినియోగదారులను ఆకర్షిస్తూ తన మార్కెట్ వాటాను నిలబెట్టుకుంటోంది.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హ్యుందాయ్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. 2030 నాటికి 26 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుమారు రూ.45,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ముఖ్యంగా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎస్యూవీలకు పెరుగుతున్న ఆదరణ, కొత్త మోడళ్ల అమ్మకాలతో హ్యుందాయ్ మే 2026లో సత్తా చాటింది. భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కంపెనీ ముందుకు సాగుతోంది.
Read Also: ఇండియన్ కార్ మార్కెట్లో మారుతి జోరు.. మేలో రికార్డు స్థాయి అమ్మకాలు!